తెలుగుయూనివర్సిటీ, అక్టోబర్ 31: కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ఆర్థిక సహాయం దోహదపడుతుందని తెలంగాణ ప్రభుత్వ న్యూఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో అరుణా ఆర్ట్స్ అకాడమీ, ప్రవాస భారతీయ వాసవీ సంఘం (యూఎస్ఏ), ఎ.వి.కె. ఫౌండేషన్ సంయుక్తాధ్వర్యంలో తెలంగాణ పర్యాటక శాఖ సౌజన్యంతో కళా సౌజన్య- 2021 పేరిట బతుకమ్మ సంబురాలు – నగదు పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, బాల సాహితీవేత్త చొక్కాపు వెంకట రమణను, ప్రముఖ సినీకవి, రచయిత ఏఆర్.రాజును, ఫోక్ పేరడీ ప్రదర్శించిన డాక్టర్ అరుణా సుబ్బారావును ఘనంగా సత్కరించారు. పలువురు కళాకారులను కళా సౌజన్య పురస్కారాలతో సత్కరించారు. టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా, సాహితీవేత్తలు ఎ.విజయ్కుమార్, త్రిపురనేని వరప్రసాద్, సంధ్యా జనక్ తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతల సేవలను కొనియాడారు.