ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులు
చిక్కడపల్లి,మే 25: కమర్షియల్ గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరగడంతో టీ స్టాల్, టిఫిన్ సెంటర్ నిర్వహించడం భారంగా మారిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో నేడు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయి. దీంతో వ్యాపారాలు నష్టంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం 8 నెలల వ్యవధిలోనే రూ.1500 ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నేడు రూ.2,560కు చేరింది. ఈ ధరలతో వ్యాపారం ఏ విధంగా చేయాలో అర్థం కావడం లేదంటున్నారు. దాదాపుగా 15 ఏండ్ల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాం.. గతంలో ఏనాడు ఇలాంటి పరిస్థితి చూడలేదని కొంతమంది వ్యాపారులు కంటతడి పెట్టారు.
గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు..
కమర్షియల్ సిలిండర్ ధర పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. నూనె, నిత్యావసరాల ధరలు కూడా అధికంగా పెరిగాయి. ధరల పెరుగుదల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. లాభాలు అటుంచి.. పెట్టుబడి రావడం కష్టంగా మారింది. 20 ఏండ్లుగా టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఈ వ్యాపారంపైనే ఆధారపడి జీవిస్తున్నాము. మరో వ్యాపారం చేసుకోలేము. టిఫిన్ ధరలు పెంచితే వ్యాపారం సాగదు.
– సంగమేశ్వర్, టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు
లాభాలు తగ్గాయి..
గ్యాస్తో పాటు నూనె ధరలు పెరగడంతో లాభాలు లేవు. అధిక ధరల మూలంగా వ్యాపారం కూడా తగ్గింది. మంచినూనె ధర రూ.120నుంచి నేడు రూ.180కు పెరిగింది. తాము కూడా ధరలు పెంచితే వ్యాపారం సాగదు. ఈవ్యాపారం తప్ప మరో వ్యాపారం తెలియదు. ఒక్కోరోజు వ్యాపారం సరిగ్గా జరుగక ఆరోజు పెట్టుబడి కూడా రావడంలేదు.
– సంజీవ్, మిర్చి బండి నిర్వాహకుడు