సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా, మాదిగల హక్కుల సాధనకు, మాదిగల అభివృద్ధి కోసం మరో పోరాటానికి సిద్ధమయ్యేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. గురువారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వంగపల్లి మాట్లాడుతూ.. యూనివర్సిటీ టెక్నాలజీ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వం హాజరుకావాలని పేర్కొన్నారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలు మరో పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందించే దిశగా మాదిగలంతా సన్నద్ధం కావాలని వంగపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో వాటా కేటాయింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల్లో సైతం మాదిగలకు మొదటి ప్రాధాన్యత కల్పించి వాళ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీ మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తన చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలన్నారు. నేడు జరిగే సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వం కదిలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు వరిగడ్డి చందు, జన్నారపు జీవన్, ధర్మారపు శ్రీకాంత్, ఎల్.నాగరాజు, కానుగంటి సురేశ్, మొగిలిపాక కిరణ్, వెంపటి శ్రీకాంత్, కార్తీక్, మణి తదితరులు పాల్గొన్నారు.