సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో గత ఏడాదిలో ప్రవేశ పెట్టిన నాలుగు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు జోన్ రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్ 2023లో 100 శాతం కంటే ఎక్కువ ప్రోత్సాహాన్ని నమోదు చేయడంతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రైల్వే జోన్ అంతటా విశేష గుర్తింపు పొందింది. దీనికి అదనంగా ఎస్సీఆర్ ఆధ్వర్యంలో జల్నా నుంచి ముంబై సీఎస్టీఎం వరకు మరో వందేభారత్ ప్రవేశ పెట్టింది.
ఈ మార్గంలో కొత్తగా ప్రవేశ పెట్టిన రైలు సోమవారం నుంచి బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్న వందేభారత్ ఎక్స్ప్రెస్లో 16 కోచ్లలో 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ స్థిరంగా నడుస్తుందన్నారు. ముఖ్యంగా గత ఏడాదిలో సికింద్రాబాద్-విశాఖపట్నం ఆక్యుపెన్సీ 134 శాతం ఉండగా, విశాఖపట్నం-సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో 143 శాతం ఉన్నట్లు తెలిపారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో ఎనిమిది కోచ్లతో కూడా ఆక్యుపెన్సీ స్థిరంగా కొనసాగుతుందన్నారు. ఈ మార్గంలో గత ఏడాది మే నుంచి 16 కోచ్లు పెంచినప్పటికీ ఆ మార్గంలో గత డిసెంబర్లో 105 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ-యశ్వంత్పూర్ మధ్య 8 బోగీలతో నడుస్తున్న వందేభారత్కు డిసెంబర్లో 107 శాతం ఆక్యుపెన్సీ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యశ్వంత్పూర్ -కాచిగూడ మధ్యలో 110 శాతం ఆక్యుపెన్సీ నమోదైందన్నారు. డిసెంబర్లో విజయవాడ- చెన్నై-వందేభారత్ స్టేషన్ల మధ్య 126 శాతం, చెన్నై-విజయవాడ మధ్యలో 119 శాతంగా నమోదైనట్లు అధికారులు వివరాలు వెల్లడించారు.