మియాపూర్, జనవరి 2 : కరోనాపై పోరుకు టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తృతం చేస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా 15-18 వయసు గల పిల్లలకు సోమవారం నుంచి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ధారిత వయసుగల చిన్నారులకు తప్పకుండా టీకా ఇప్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ మేరకు ఆదివారం విప్ గాంధీ కార్యాలయం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. పిల్లలకు కోవాగ్జిన్ టీకాను నియోజకవర్గంలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (ఎల్లమ్మబండ, హఫీజ్పేట్, శేరిలింగంపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొండాపూర్ ఏరియా దవాఖాన)లో వైద్యాధికారుల పర్యవేక్షణలో అందిస్తారని, తమకు అందుబాటులో ఉన్న ఈ కేంద్రాలకు వెళ్లి పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలని పేర్కొన్నారు. ఇప్పటికే 18 సంవత్సరాలకు పై బడ్డ వారికి ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, కేంద్రాలతో పాటు మొబైల్ టీకా సేవలను అందిస్తున్నదని తెలిపారు. కరోనా రూపాంతరం చెందుతూ వేరియంట్లుగా మారుతున్న వేళ టీకాయే శ్రీరామరక్షని విప్ గాంధీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం 15-18 వయసు గల చిన్నారులకు కోవాగ్జిన్ టీకా కార్యక్రమాన్ని చేపడుతున్నందున నియోజకవర్గంలో తమకు అందుబాటులో ఉన్న కేంద్రంలో ఈ సేవలను పొందాలని ఆయన కోరారు. చిన్నారులకు టీకాను వేయనున్నందున కేంద్రాలలో తగు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విప్ గాంధీ అధికారులకు సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి..
కొవిడ్ ఉదృతి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒకరికి 100 శాతం వ్యాక్సినేషన్ను చేరువ చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. నేటి (సోమవారం) నుంచి హఫీజ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి కోవాగ్జిన్ టీకాలను వేయనున్నారు. దీనిని ప్రతి ఒకరు సద్వినియోగం చేసుకొని, కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కృషి చేయాలని హఫీజ్పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, డాక్టర్ వినయ్ బాబు తెలిపారు.