సిటీబ్యూరో, జనవరి 2(నమస్తే తెలంగాణ)/ మేడ్చల్: నేటి నుంచి మరో కీలక ఘట్టం ప్రారంభం కానుంది. కొవిడ్ వ్యాక్సిన్లో మొదటి డోస్ను వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన తెలంగాణ.. ఇప్పుడు 15-18 ఏండ్ల వయసున్న వారికి వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని యూపీహెచ్సీ, పీహెచ్సీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు సకల వసతులు కల్పించారు. కేవలం కొవాగ్జిన్ను మాత్రమే పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. మూడు జిల్లాల పరిధిలో 15-18 ఏండ్ల మధ్య వయసున్న వారు సుమారు 5.90 లక్షల మంది ఉన్నట్లుగా అధికారులు అంచనా వేశారు. వీరికి వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు మూడు జిల్లాల పరిధుల్లో 174 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15-18 ఏండ్ల వయసున్న వారికి వ్యాక్సిన్ వేయించేందుకుగాను కొవిన్ యాప్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని యూపీహెచ్సీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ అవతల ప్రాంతాల్లోని పీహెచ్సీల్లో మాత్రం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారితో పాటు వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లిన వారికి అక్కడికక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించి వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు 1500 మందికి పైగా సిబ్బందిని కేటాయించినట్లు హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి తెలిపారు.
టీకా ఇలా..