సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 2023 – 24 విద్యా సంవత్సరంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ తరుపున జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు కనీసం 18 ఏండ్లు, గరిష్టంగా 44 సంవత్సరాలు మించి ఉండకూడదన్నారు. నెలకు రూ.22,750 జీతాన్ని ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా చెల్లించనున్నారు.
అయితే, ఇందులో మొత్తం 14 పోస్టులు ఉన్నాయని, వాటిలో ఆశ్రమ పాఠశాలలు 2, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 2, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 10 చొప్పున ఖాళీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇతర డిపార్టుమెంట్లో ఏఎన్ఎంగా అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్లైన్ దరఖాస్తుల కోసం https:tsobmms.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. దరఖాస్తులను జూలై 13 లోగా ఆ శాఖకు చేరుకునే విధంగా పంపుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నం: 98499 95875లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలన్నారు.