సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ) : పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల విభాగం మొట్టమొదటి సారిగా వినూత్న చర్యలు చేపట్టింది. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు ‘పోల్ క్యూ రూట్’ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా పోలింగ్ స్టేషన్ల వద్ద నిలబడి ఉన్న ఓటర్ల క్యూ లైన్ వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ తెలిపారు.
ముందుగా జీహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్లిన తర్వాత.. పోల్ క్యూ రూట్ను సెలెక్ట్ చేసుకోవాలన్నారు. ఆ తర్వాత నియోజకవర్గం పేరు, పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉన్నదో నావియేషన్ (గూగుల్ మ్యాప్) చూపిస్తుందని పేర్కొన్నారు. ఎంతమంది క్యూలో వేచి ఉన్నారో అన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. ఇందులో వెయింటింగ్ టైం కూడా తెలుసుకోవచ్చునని వివరించారు. ఈ యాప్లో నియోజకవర్గం పేరు, పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేసి.. మీరు ఓటు చేసే పోలింగ్ కేంద్రం వద్ద ఉన్న క్యూలైన్ వివరాలు తెలుసుకోవచ్చని రొనాల్డ్రాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ యాప్ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున ఓటు వేయాలన్నారు.
రిటర్నింగ్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈవీఎంలను పోలింగ్ తేదీ (గురువారం)న ప్రిసైడింగ్ అధికారి (పీవో) సారథ్యలో వాటిని పోలింగ్ కేంద్రాలలో అమర్చుతారు. ఉదయం 5. 30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తరఫున వచ్చిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 6.30 లోగా మాక్ పోలింగ్ ప్రక్రియను ముగిస్తారు. ఏజెంట్లు అన్ని పరిశీలించి.. అభ్యంతరాలు లేవని చెప్పిన తర్వాతే ఈవీఎంను ఓటింగ్కు ఉపయోగిస్తారు. ఏవైనా సందేహాలు ఉంటే రిజర్వ్ చేసిన ఈవీఎంను పరీక్షించి.. ఏజెంట్లు ఒప్పుకుంటే వాటిని ఓటింగ్కు వాడతారు. మాక్ పోలింగ్లో ప్రతి ఈవీఎంలో 50 ఓట్లకు తగ్గకుండా ఓట్లు వేస్తారు. వాటిని ఏజెంట్ల సమక్షంలో లెక్కిస్తారు. ఇందులో నోటాకు సైతం ఓటు వేయాల్సి ఉంటుంది. అన్నీ సరిగా ఉంటేనే.. ఆ ఈవీఎంను వారి సమక్షంలోనే జీరో చేసి ఓటర్లు ఓటు వేసేందుకు ఉపయోగిస్తారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది.
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు కీలకమైనవి. దీంతో వాటి పనితీరు సరిగా ఉంటేనే ఓటర్లు తమ ఓటును సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాక్ పోలింగ్ సమయంలోనే ఈవీఎంల పనితీరును పరిశీలిస్తారు. ఓటరు ఓటేయాలంటే కంట్రోల్ యూనిట్ (సీయూ), వీవీ ప్యాట్, బ్యాలెట్ యూనిట్..ఈ మూడు సరిగా పనిచేయాల్సి ఉంటు ంది. సీయూ, బీయూ పనిచేయకపోతే సీయూ, బీయూతో పాటు వీవీ ప్యాట్ను మార్చాల్సి ఉంటుంది. కొత్త వాటితో మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించాలి. సీయూ బ్యాటరీ పనిచేయకపోతే బ్యాటరీ మాత్రమే అమర్చుతారు. అప్పుడు మాక్ పోలింగ్ అవసరం ఉండదు.
పోలింగ్ గడువు ముగుస్తుందనే అంశాన్ని 15 నిమిషాల ముందే ప్రిసైడింగ్ అధికారి ప్రకటించాల్సి ఉంటుంది. సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న వారందరూ ఓటు వేయడానికి అర్హులు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సీయూలో ‘క్లోజ్’ బటన్ నొక్కుతారు. అనంతరం సీయూలో మొత్తం ఓట్లు, 17ఏలో మొత్తం ఓట్లు, ఓటర్ స్లిప్పులు పరిశీలించుకుంటారు. ఆ తర్వాత సీయూ స్విచ్ ఆఫ్ చేసి వీవీ ప్యాట్, బ్యాలెట్ యూనిట్లను డిస్ కనెక్ట్ చేస్తారు. వీవీప్యాట్ నుంచి బ్యాటరీ తీసివేస్తారు. పోలింగ్ మొదలవగానే సీయూ, వీవీ ప్యాట్లకు సీల్ వేస్తారు. చివరిలో క్లోజ్ చేస్తారు. అన్ని సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఏజెంట్లతో సంతకం తీసుకుంటారు.
పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మొదలైనప్పటి నుంచి ప్రతి రెండు గంటలకోకసారి పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు. అయితే, 17-ఏ రిజిస్టర్లో నమోదు చేసిన ఓట్లు, ఓటరు స్లిప్పులు , సీయూలో మొత్తం ఓట్లను సరి చూసుకుంటారు. అప్పుడే పోలింగ్ శాతాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఉదయం 9, 11, ఒంటిగంట, 3 గంటలు, 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ శాతాన్ని వెల్లడిస్తారు. పోలింగ్ కేంద్రంలో నమోదైన పోలింగ్ శాతాన్ని ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత సెక్టార్ అధికారులకు పంపిస్తారు. సెక్టార్ అధికారులు జిల్లా ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తారు.
పోలింగ్ ముగిసిన వెంటనే సీల్ వేసి.. క్లోజ్ చేసిన సీయూ, బీయూ, వీవీ ప్యాట్లను ఆయా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కేంద్రాలకు చేరస్తారు. మరుసటి రోజు ప్రత్యేక భద్రత మధ్య ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన లెక్కింపు కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూంలకు తరలిస్తారు.
ఓటర్లలో పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు.. ఇలా మూడు రకాలు ఉన్నారు. ఓటు వేసేందుకు వచ్చినప్పుడు అదనపు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేక గుర్తులతో మార్కింగ్ చేస్తారు. ఓటు వేయడానికి పురుషులు వస్తే ఓటరు జాబితాలో పేరుంటే వారికి అడ్డుగీత గీసి మార్కింగ్ చేస్తారు. మహిళలు వస్తే వారికి అడ్డుగీతతో పాటు వారి ఓటరు క్రమ సంఖ్యకు వృత్తం చుడతారు. ఇక ట్రాన్స్జెండర్లు వస్తే అడ్డుగీతతో పాటు వారి క్రమ సంఖ్యకు స్టార్ గుర్తు వేస్తారు. ఈ విధానం వల్ల ఎవరెవరూ ఎంతమంది ఓటేశారో సులువుగా తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.