హైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ) : తప్పుడు సమాచారంపై అప్రమత్తంగా ఉంటూ సత్యాన్ని రక్షించుకోవడం పౌరుల విధి, బాధ్యత అని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ పిలుపునిచ్చారు. వార్తల ప్రసారానికి ముందు వాస్తవాలను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. సోమవారం యూఎస్ కాన్సులేట్, ఉస్మానియా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ‘కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ ఫర్ తెలుగు టీవీ రిపోర్టర్స్’ అనే అంశంపై రెండు రోజుల వర్క్షాప్లో ఫ్రాంకీ స్టర్మ్ ప్రసంగించారు.
టీవీ చానళ్లలో తప్పుడు సమాచారంపై విస్తృత చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందని, వాస్తవ సమాచారంపై ప్రాథమిక అవగాహన ఉంటేనే తప్పుడు సమాచారాన్ని తిప్పిగొట్టగలమని తెలిపారు. ఈ అంశంలో ఉస్మానియా యూనివర్సిటీ కృషి చేస్తున్నదని, ఇప్పటికే 100 గంటలపాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించిందని గుర్తుచేశారు. తపు్పుడు సమాచారం వ్యక్తుల, సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నదని ఉస్మానియా యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ డీ రవీందర్ ఆందోళన వ్యక్తంచేశారు.
ఓయూ డిపార్టుమెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ స్టీవెన్సన్ కోహిర్ మాట్లాడుతూ.. వార్తలలో వాస్తవ నిర్ధారణ అనే అంశంపై ఫ్యాక్ట్చెకర్స్ ఉడుముల సుధాకర్రెడ్డి, బీఎస్ సత్యప్రియ తెలుగులో అందించిన సమాచారం, మెళకువలు జర్నలిస్టులకు ఉపయోగకరంగా ఉన్నాయని అన్నారు. ఈ అంశంలో టెక్సాస్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ అనంత సుధాకర్ బొబ్బిలి తమ అంతర్జాతీయ నైపుణ్యం, అనుభవాలను పంచుకున్నారు. యూస్ కాన్సులేట్ మీడియా అడ్వయిజర్ అబ్దుల్ బాసిత్, ఫ్యాక్ట్ ట్రైనర్స్ కొరీనా సురేశ్, ఎస్ రాముతో పాటు వివిధ చానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.