దుండిగల్/కుత్బుల్లాపూర్,జూన్16: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం పట్టణప్రగతి దినోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగగా, దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు చైర్పర్సన్ సుంకరి కృష్ణవేణికృష్ణ అధ్యక్షత వహించారు. అదేవిధంగా కొంపల్లిలో చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిజాంపేట్ కార్పొరేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్లాడుతూ.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నిరంగాలల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కమిషనర్ రామకృష్ణారావుతో కలిసి ‘సఫాయి అన్నకు సలాం’ పేరుతో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో ఉత్తమసేవలు అందిస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాలల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన అధికారులు, సిబ్బందికి, మహిళాసంఘాలకు, స్ట్రీట్వెండర్స్కు, క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ పాలకవర్గం సభ్యులతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రగతినగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పుచ్చలపల్లి లీలాసందరయ్య ఫంక్షన్హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
దుండిగల్ కార్యాలయంలో చైర్పర్సన్ సుంకరిక్రిష్ణ అధ్యక్షత జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీగా దుండిగల్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తూ రూపొందించిన ‘ప్రగతి నివేదిక’ను ఆవిష్కరించారు. అనంతరం చైర్పర్సన్ క్రిష్ణవేణికృష్ణ, కమిషనర్ సత్యనారాయణతో కలిసి ‘సఫాయి అన్నకు సలాం’ పేరుతో పారిశుధ్య కార్మికులను సత్కరించారు. మున్సిపాలిటీ పరిధిలో ఉత్తమసేవలు అందిస్తున్న ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాలల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన అధికారులు, సిబ్బందికి, మహిళా సంఘాలకు, స్ట్రీట్వెండర్స్కు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. అంతకుముందు క్రిష్ణవేణికృష్ణ మహిళా ఉద్యోగులు, పొదుపు సంఘాల మహిళతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. కార్యాలయం ప్రాంగణంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావుపాటు పాలకవర్గం సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి దినోత్సవం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, కమిషనర్ కే.శ్రీహరితో పాటు పాలకమండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. కొంపల్లి, దూలపల్లి ప్రాంతాల్లో 74 మంది మహిళలతో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. స్కూల్స్ విద్యార్థులతో పాటు ఎస్హెచ్జీ మహిళలతో కలిసి కొంపల్లి కమాన్ నుంచి మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు మానవహారం నిర్వహించారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్తో పాటు చైర్మన్, కమిషనర్తో పాటు పాలకమండలి ఆధ్వర్యంలో ఆవిష్కరించిన అనంతరం కొంపల్లి మున్సిపాలిటీ ప్రగతినివేదిక పుస్తకాన్ని విడుదల చేశారు. మల్టీపర్సస్ ఫంక్షన్హాల్ ఆవరణలో జరిగిన వేడుకల్లో భాగంగా మహిళాసంఘాలకు, స్ట్రీట్వెండర్స్కు మంజూరైన రూ.19 కోట్ల 78 లక్షల 30 వేల విలువ గల రుణాలకు సంబంధించిన చెక్కులను అందించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి ఉత్తమఅవార్డులు, ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సీహెచ్.శ్రీనివాస్గౌడ్, జూనియర్ అసిస్టెంట్ డి.రంజిత్కుమార్, వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, ఆర్పీలు, ఎస్హెచ్జీ సభ్యులు, బ్యాంకు అధికారులు, వివిధ కాలనీల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, విద్యార్థులు పాల్గొన్నారు.