100 అడుగులతో మరో లింకు రోడ్డు
నల్లచెరువు-పీర్జాదిగూడ
కూడలి వద్ద కలిసేలా నిర్మాణం
ఇప్పటికే టెండర్ల ఆహ్వానం
త్వరలో పనుల ప్రారంభానికి సన్నాహాలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ చేపట్టిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మీదుగా హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని కలుపుతూ కొత్తగా లింకు రోడ్డును నిర్మించనున్నారు. ఇప్పటికే ఉప్పల్ భగాయత్ లేఅవుట్లోని రోడ్ల మీదుగా ఉప్పల్ బస్టాండు తర్వాత ఉన్న ఏసియన్ మల్టీప్లెక్స్ కలిసే రోడ్డుతో లింకురోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతించారు. ఇదే తరహాలో పీర్జాదిగూడ కమాన్ రోడ్డును కలిపేలా కొత్తగా 100 అడుగుల విస్తీర్ణంలో లింకు రోడ్డును నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన పనులకు టెండర్లు పిలవగా, త్వరలోనే క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టనున్నారు.
భవిష్యత్లో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా..
గ్రేటర్ హైదరాబాద్ తూర్పు ప్రాంతం వైపు ఉన్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారులకు ప్రత్యామ్నాయంగా రెండు లింకు రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా దశల వారీగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికే నాగోల్ నుంచి విజయవాడ హైవే ఉన్న పెద్ద అంబర్పేట, అదేవిధంగా తారామతిపేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును కలిసేలా ఒక రేడియల్ రోడ్డును నిర్మించారు. అదే తరహాలో నాగోల్-ఉప్పల్ మధ్య మూసీ వెంబడి మరో రేడియల్ రోడ్డును నిర్మించాలని మాస్టర్ప్లాన్లో పొందుపర్చారు. అందులో భాగంగానే భవిష్యత్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లింకు రోడ్లను 80 అడుగుల నుంచి 120 అడుగుల వెడల్పుతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచారు. తూర్పు వైపు నగరం విస్తరిస్తున్న కొద్దీ ఈ రోడ్లను అభివృద్ధి చేసి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా లింకు రోడ్లను, రేడియల్ రోడ్లను అందుబాటులోకి హెచ్ఎండీఏ తీసుకువస్తోంది.