నగరంలో ఐపీఎల్ సందడి నెలకొన్నది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ సన్ రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను తిలకించేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : నగరంలో ఐపీఎల్ సందడి ఆకాశన్నంటింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ సన్ రైజర్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ చూడటానికి నగరవాసులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఉప్పల్ రోడ్లు రద్దీగా మారాయి. రద్దీకి అనుగుణంగా మెట్రో రైళ్లు నడిపినట్టు అధికారులు తెలిపారు.
ఆదివారం కావడంతో చాలా మంది స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి మ్యాచ్ను తిలకించారు. స్టేడియం బయట, లోపల అభిమానుల విజిల్స్, కేరింతలతో పండుగ వాతావరణం నెలకొన్నది. లైవ్ మ్యాచ్ను వీక్షించడం గొప్ప అనుభూతినిచ్చిందని ప్రేక్షకులు తెలిపారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రికెట్ను ఆస్వాదించామని క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది.