సిటీబ్యూరో: ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్కు మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ జీవోను విడుదల చేశారు. కాప్రా మున్సిపల్ చైర్మన్గా, ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బండారి రాజిరెడ్డి అందించిన సేవలను ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో కొనియాడింది.
ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని, నియోజకవర్గ ప్రజలతో ఆయనకు ఉన్న విడదీయలేని అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ కారిడార్కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టాలని స్థానికులు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నుంచి విన్నపాలు వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పంపిన ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం, స్టాండింగ్ కమిటీలో తీర్మానం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ పేరుకు సంబంధించి తదుపరి చర్యలు తక్షణమే తీసుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.