రామంతాపూర్, ఏప్రిల్ 28 : రానున్న రోజుల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ అతి పెద్ద నగరంగా రూపుదిద్దుకుంటుందని ఐఏఎస్ అధికారి, శాతవాహన యునివర్సిటీ వైస్ చాన్సలర్ చిరంజీవులు అన్నారు. ఎక్సెల్ మ్యాగజైన్ ఇండియా ఎడిటర్ సంగెం రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం రామంతాపూర్ క్రాంతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉప్పల్ అభివృద్ధిపై నిర్వహించిన లీడర్ షిప్ మీట్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పలువురు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఔటర్ రింగ్రోడ్డు, విశాలమైన రహదారులు, లైటింగ్ సిస్టమ్, గ్రీనరీతో ఎంతో అభివృద్ధి చెందడం హర్షించదగ్గ పరిణామమన్నారు.
రానున్న 25 ఏండ్లలో రెండింతలు విస్తరించడం ఖాయమన్నారు. ఉప్పల్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. ఉప్పల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తున్నానన్నారు. భగాయత్ భూములు, ఎలివేటెడ్ కారిడార్, చెరువుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రాంతాల డినోటిఫై ఏర్పాటు, ఉప్పల్, మల్లాపూర్, నాచారం తదితర ప్రాంతాల్లో డంపింగ్ యార్డుల అభివృద్ధి వంటి అనేక పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంలో వంద పడకల వైద్యశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బిల్డర్లు యాదవరెడ్డి, గంధం నాగేశ్వర్రావు, జి.కృష్ణారెడ్డి, క్రాంతి కళాశాల చైర్మన్ టి.భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.