Hyderabad | హైదరాబాద్లోని కుసుమ హరనాథ్ ఆశ్రమంలో సోమవారం సామూహిక ఉపనయన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 40 మంది బ్రాహ్మణ వటువులకు ఉపనయనం చేయగా.. వేములవాడ, శ్రీశైల క్షేత్రాలకు చెందిన పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ బ్రాహ్మణ భాగ్యనగర సమితి (VBBS) సరూర్నగర్ కేంద్రంగా 2020 నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నది. ఉపనయనానికి వచ్చే వటువులకు ముందురోజు వసతి కల్పించడంతో పాటు కార్యక్రమానికి అవసరమైన దీక్షావస్త్రాలతో సమకూరుస్తున్నది. ఈ సందర్భంగా సంధ్యావందనం ఎలా ఆచరించాలో తెలిపే.. రుగ్వేద, యజుర్వేద విధాన సంధ్యావందనం పుస్తకాల కూడా ఉచితంగా నిర్వాహకులు అందచేశారు. కార్యక్రమం అనంతరం వటువులతో పాటు తల్లిదండ్రులు, బంధువులకు ఉచిత భోజన ప్రసాదం అందజేశారు. అలాగే, వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆశీస్సులు, తీర్థప్రసాదాలను అందజేశారు.