మియాపూర్ , అక్టోబర్ 25 : గుర్తు తెలియని ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మృతదేహం 60 శాతానికి పైగా కాలిపోయి ఉంది. రెండు రోజుల కిందటే దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా.? లేక.. అమావాస్య నేపథ్యంలో క్షుద్రపూజల పేరుతో జరిగిన ఘాతుకమా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. కేపీహెచ్బీ సీఐ కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్నగర్ అలీ తలాబ్ చెరువు సమీపంలోని శ్మశాన వాటికలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని మృతదేహాన్ని (25-30) గుర్తించిన కాటికాపరి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంతో పాటు పరిసరాలను పరిశీలించారు. దండగులు డీజిల్ పోసి మృతదేహానికి నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం సమీపంలో బ్యాగు, ఫోన్ కనిపించింది. రెండింటీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం సమీపంలో బియ్యం పిండి.. చిల్లర నాణేలు ఉండటంతో క్షుద్రపూజల నేపథ్యంలో ఈ హత్య జరిగిందా.. అన్న అనుమానాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. అక్కడ లభించిన వస్తువులను పరిశీలించిన పోలీసులు.. శ్మశాన వాటిక కావడంతో దశదిన కర్మలకు సంబంధించిన వస్తువులు అయి ఉంటాయని భావిస్తున్నారు. మృతదేహం లభించిన తీరు.. అక్కడ లభించిన ఆధారాల నేపథ్యంలో ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన ప్రాథమిక వివరాలు సైతం లభించలేదని, ఆధారాల మేరకు హత్య కేసు కింద నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేపీహెచ్బీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.