సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో గుర్తు తెలియని శవాలు బయటపడుతున్నాయి. ఎక్కడో హత్య చేసి.. శివారుల్లో పడవేస్తున్న ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయి. శివారు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో గుర్తు తెలియని ఆ శవాల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు నానా ఇబ్బంది పడుతున్నారు. వారం, పది రోజులు గడుస్తున్నా..
ఒక్క క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. నిందితులు పక్కా ప్లాన్తోనే శవాలను కాల్చేయడం, శవాలను వదిలేసి వెళ్తున్నారు. ఈ కేసులను పరిష్కరించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అత్యాధునిక పెట్రోలింగ్ వ్యవస్థనను ఏర్పాటు చేశారు. నిరంతరం పెట్రోలింగ్ చేయాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో దుండగులు యథేచ్ఛంగా శవాలను పడేసేందుకు శివారు ప్రాంతాలను అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోకి వస్తుంది. సైబరాబాద్లో చాలా వరకు, రాచకొండలో కొన్ని ప్రాంతాలు ఔటర్ వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. దీంతో నిందితులు నిర్జన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. పోలీసుల నిఘా ఉండని ప్రాంతాల కోసం వెతికి.. ముందుగా రెక్కీ నిర్వహించి.. ఆ తర్వాతనే ఆయా ప్రాంతాల్లో మృతదేహాలను పడేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలు, సెల్ఫోన్కు సంబంధించిన ఆధారాలు ఉంటే కేసుల చిక్కుముడి ఈజీగా విడే అవకాశం ఉన్నదని, నిందితులు ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదలకపోవడంతో ఈ కేసుల మిస్టరీని ఛేదించడంలో పోలీసులు ఇబ్బంది పడుతున్నారు.
ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనలు..
జనవరి 16: ఒక వ్యక్తిని హత్య చేసి, చేతులు, కాళ్లు కట్టేసి గోణె సంచిలో మృతదేహాన్ని చుట్టి ఔటర్ రింగు రోడ్డుపై మూటను కింద పడేసి వెళ్లారు. దీనిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయంటేనే.. ఎక్కడో హత్య చేసిన దుండగులు.. శవాన్ని ఇక్కడ పడేశారన్న విషయం స్పష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు.
జనవరి 16 : బాలానగర్- గండిమైసమ్మ రోడ్డులోని మయూరి టైల్స్ కంపెనీ వద్ద రోడ్డు పక్కన గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం దుండిగల్ పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతూ అతడు ప్రమాదానికి గురయ్యాడా..? తలకు బలమైన గాయాలు ఉండటంతో ఎవరైనా హత్యా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
జనవరి 9: ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని మంగళ్పల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒక మహిళ మృతదేహం బయటపడింది. ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనేది నిర్ధారణ కాలేదు.