బేగంపేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ రాష్ట్ర శిక్షణ ఉపాధి సంస్థ, సెట్విన్ సంస్థ సంయుక్తా ధ్వర్యంలో సికింద్రాబాద్లోని యూత్ హాస్టల్లో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్, డైరక్టర్ వాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ జాబ్మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…త్వరలోనే జిల్లా కేంద్రాలలో కూడా ఈ తరహా జాబ్ మేళాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మార్చి 5న మహబూబ్నగర్, 6న ఖమ్మం జిల్లా కేంద్రాలలో ఈ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తామని అన్నారు. సికింద్రాబాద్ యూత్ హాస్టల్లో జరిగిన ఈ జాబ్ మేళాలో సుమారు 50 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నియామకాలు చేపట్టడం జరిగిందని అన్నారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా నిర్వహించారు. సాఫ్ట్ వేర్, ఫార్మసీ, ఎంటర్టైన్మెంట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ రిలేషన్ షిప్, కార్పొరేట్, మార్కెటింగ్, డెలివరీభాయ్స్ తదితర రంగాలలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా వారి అర్హతను బట్టి ధరఖాస్తులు చేసుకున్నారని అన్నారు.
పదవ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఈ మేళాకు హాజరైనట్టు వెల్లడించా రు. ఎంపికైన నిరుద్యోగులకు అప్పటికప్పుడే ఆయా కంపెనీల ప్రతినిధులు నియామక పత్రాలు అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ సంస్థ ఎండీ వేణుగోపాల్రావు, యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరక్టర్ అనంతరెడ్డి, టెస్టెప్ జనరల్ మేనేజర్ జగన్నాధన్, మన్మోహాన్ తదితరులు పాల్గొన్నారు.