నగర శివారుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించగా.. బండ్లగూడ జాగీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతురు మరణించారు. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ రెండు ప్రమాదాలపై సంబంధిత పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, జూలై 4 : ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్ రోడ్డులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన ముగ్గురు భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఇబ్రహీంపట్నం సమీపంలోని మంగల్పల్లిలో ఉన్న భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న కె.నవీన్, ఎస్.నారాయణరెడ్డి, భానుప్రసాద్ ముగ్గురూ మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రాయపోల్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ఇబ్రహీంపట్నం నుంచి రాయపోల్కు వెళ్తున్న హెర్టికా కారు అతివేగంగా ఎదురుగా వస్తున్న వీరి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతిచెందిన విద్యార్థులు నగరంలోని లంగర్హౌజ్, వనస్థలిపురం, రంగారెడ్డిజిల్లా కందుకూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
కొడుకు చదువుకోసం ఊరుమారి..
నారాయణరెడ్డి కందుకూరు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్రెడ్డి కుమారుడు. తన కుమారుడిని ఇంజినీరింగ్ చదివించడం కోసం నగరంలోని హస్తినాపురంలో ఉంటూ.. కళాశాలకు పంపిస్తున్నాడు. కుమారుడు మరణించిన విషయం తెలుసుకుని ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికందివస్తున్న తరుణంలోనే కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. లంగర్హౌజ్కు చెందిన భానుప్రసాద్ కళాశాలకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. తిరిగి క్షేమంగా వస్తాడనుకున్న తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. నవీన్ హస్తినాపురంలో నివాసముంటూ భారత్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
చెల్లాచదురుగా పడిన మృతదేహాలు..
ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకుల మృతదేహాలు చెల్లాచదురుగా పడ్డాయి. కారు వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ముగ్గురు యువకులు చనిపోయారని స్థానికులు తెలిపారు. ఈ మార్గంలో వేగంగా వాహనాలు వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు.. బైక్ నుజ్జునుజ్జయ్యాయి. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మితిమీరిన వేగానికి ముగ్గురు బలి..
మితిమీరిన వేగం, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. రాయపోల్ గ్రామానికి చెందిన శివ తన హెర్టికా కారులో తన తండ్రిని తీసుకుని ఇబ్రహీంపట్నం వైపు నుంచి రాయపోల్కు వెళ్తున్నాడు. సింగిల్ రోడ్డు అయినప్పటికీ మితిమీరిన వేగంతో వెళ్లడంతో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. దీంతో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు.
ఏరియా ఆస్పత్రికి మృతదేహాల తరలింపు..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతదేహాలను ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మృతదేహాలకు బుధవారం శవ పంచనామ నిర్వహించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రి కిక్కిరిసి పోయింది. ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి.