బంజారాహిల్స్, ఫిబ్రవరి 15: యూసుఫ్గూడ సమీపంలోని ఎల్ఎన్నగర్లో పుట్టా రాము హత్య కేసులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు రౌడీషీటర్లతో పాటు మరో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 7న అర్ధరాత్రి ఎల్ఎన్నగర్లో హిమాంబీకి చెందిన ఇంట్లో పుట్టా రాము దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మణికంఠతో సహా మొత్తం 8 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. కాగా, బోరబండకు చెందిన రౌడీషీటర్ జిలానీతో పాటు అతడి సోదరుడు ఫారూక్, యూనిస్, ఫిరోజ్ కూడా పుట్టా రామును హత్య చేసిన వారిలో ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మణికంఠతో ఉన్న పాతకక్షలు, హిమాంబీతో పాటు ఆమె కూతురు నసీమాతో ఉన్న వివాదాలే పుట్టా రాము హత్యకు కారణమా..! లేకుంటే ఏవైనా భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఉన్నాయా..! అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ హత్య కేసులో నిందితులుగా ఉన్న జిలానీపై గతంలో హత్యాయత్నం కేసు, అతడి సోదరుడు ఫారూక్పై హత్య కేసు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పుట్టా రామును హత్య చేసిన తర్వాత నిందితులంతా కారులో పారిపోయారు. నిందితుల వద్ద నుంచి పూర్తి వివరాలు సేకరించి, శుక్రవారం అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హిమాంబీతో వీరికి ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.