సిటీబ్యూరో, జనవరి 11(నమస్తే తెలంగాణ): ప్రేమ, వ్యాపార వ్యవహారాలు విజయవంతం కావడానికి పూజలు చేస్తామంటూ ఓ నేత్ర వైద్యురాలిని నమ్మించి రూ. 12 లక్షలు స్వాహా చేసిన ఇద్దరు నైజీరియన్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ ఏసీపీ హరికృష్ణ కథనం ప్రకారం.. నైజీరియాకు చెందిన ఓక్వుచుక్వ, ఓబిబుర్ జోన్తన్ ఉజాకలు మైకెల్ బట్టల వ్యాపారం పేరుతో భారతదేశానికి వచ్చారు. సునాయసంగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశారు. సైబర్నేరాలు చేసి అమాయకులను మోసం చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఇతర సోషల్మీడియా ప్లాట్ఫామ్స్లో అస్ట్రాలజీలో ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టడం, వ్యాపార లావాదేవీలు పెంపొందిస్తామంటూ ప్రకటనలు వేశారు. ఇదిలా ఉండగా.. కుషాయిగూడకు చెందిన బాధితురాలు జ్యోతిష్యం కోసం గూగుల్లో సెర్చ్ చేయడంతో సైబర్నేరగాళ్ల ప్రకటన కనిపించింది.
వైద్యురాలు ఆ ప్రకటనపై క్లిక్ చేసి, తన ప్రేమకు సంబంధించిన విషయంలో కొన్ని సమస్యలుఉన్నాయని, వాటిని పరిష్కరించుకోవాలని, జాతకం బాగుండాలంటూ ఫోన్లో మాట్లాడింది. మేం ఉగాండకు చెందిన వాళ్లమని, మీ గురించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తామని, ఒక లక్ష రూపాయలు చెల్లించాలంటూ సూచించారు. డాక్టర్ డబ్బులు చెల్లించింది. కొన్నాళ్లకు సమస్య పరిష్కారమైంది. వాళ్లను సంప్రదించడం వల్లనే సమస్య పరిష్కారమయ్యిందనే భావనతో, తాను వ్యాపారం మొదలు పెట్టాలని, అది బాగుండాలంటే ప్రార్థనలు చేయించాలని భావించి, తిరిగి వాళ్లను సంప్రదించింది. ప్రార్థనల పేరుతో నేరగాళ్లు రక రకాల కారణాలు చెబుతూ ఆమె వద్ద నుంచి రూ. 12,45,105 వివిధ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు అడగడంతో ఇదంతా మోసమని గుర్తించిన వైద్యురాలు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపి నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. నిందితులిద్దరని అరెస్ట్ చేసి, హైదరాబాద్కు తరలించారు. కాగా, అరెస్టయిన ఇద్దరు నిందితులు, ప్రస్తుతం పరారీలో ఉన్న మైఖేల్ అజుండ, డానియల్ కలిసి ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి ఈ మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. సీపీ డీఎస్ చౌహాన్ పర్యవేక్షణలో క్రైమ్స్ డీసీపీ శ్రీబాల నేతృత్వంలో ఏసీపీ హరికృష్ణ, ఇన్స్పెక్టర్ నరేందర్ బృందం దర్యాప్తు చేస్తుంది.