మేడ్చల్, నవంబర్ 13 , (నమస్తే తెలంగాణ): రైతుల గడప వద్దకే పశు వైద్య సేవలు అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రెండు సంచార పశు వైద్యశాలలను అధికారులు అందుబాటులో ఉంచారు. పశుసంపద పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సంచార పశు వైద్యశాలల ద్వారా పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. మేడ్చల్, ఉప్పల్ నియోజకవర్గాల్లో 2 సంచార వాహనాలు ఏర్పాటు చేసి పశువులకు వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పశువులకు రైతుల గడప వద్దనే పశు వైద్యాధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు.
1962కు ఫోన్ చేస్తే వైద్య సేవలు…
పశువులకు వైద్య సేవలు అందించేందుకు పశు వైద్యశాఖ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1962ను ఏర్పాటు చేసింది. రైతులు పశువులకు వైద్య సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వారి ఇంటి వద్దకే వచ్చి వైద్య సేవలు అందిస్తారు. సంచార పశువైద్యశాలలో వైద్యుడు, కంపోండర్, అటెండర్ వైద్య సేవలు అందించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తారు. ఈ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
సంచార పశు వైద్యశాలలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. టోల్ప్రీ నంబర్కు ఫోన్ చేస్తే వైద్య సేవలు అందిస్తారు. ఉచిత వైద్య సేవలతో పాటు మందులను అందిస్తారు. అంతేగాక మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 పశు వైద్య కేంద్రాల్లో వైద్య సేవలు పొందవచ్చు. సీజన్ల వారీగా పశువులు వ్యాధికి గురికాకుండా ఉండేందుకు టీకాలు ఇస్తాం.
-శేఖర్, పశువైద్యాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా