దుండిగల్, మార్చి 21: సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రెండు గంటల వ్యవధిలో కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఇన్స్పెక్టర్ ఆకుల వెంకటేశం కథనం ప్రకారం.. గాజులరామారంలోని ఓక్షిత్ హిల్వ్యూ కాలనీకి చెందిన బొల్లా రాజశేఖర్రెడ్డి, సుజాత దంపతులు. వీరి నాలుగేండ్ల కుమారుడు ఇషాన్రెడ్డి. సుజాతకు ఆరోగ్యం బాగలేకపోవడంతో ఈ దంపతులు గురువారం ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి వైద్యశాలకు వెళ్లారు.
ఉదయం పదిన్నర సమయంలో డాక్టర్ వచ్చాడు. సుజాత ఒక్కరే డాక్టర్ వద్దకు వెళ్లడం గమనించిన ఓ మహిళ.. మీ బాబును నేను చూస్తాను..! మీరు మీ భార్యతో వెళ్లి డాక్టర్కు చూపించండి. కావాలంటే మీ బాబు ఇషాన్రెడ్డికి మీ ఫోన్ ఇవ్వండి.. అని ఆమె చెప్పడంతో రాజశేఖర్రెడ్డి నమ్మాడు. ఆమె చెప్పినట్టుగానే భార్యతో కలిసి డాక్టర్ వద్దకు వెళ్లాడు. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి చూడగా.. ఇషాన్రెడ్డితో పాటు అక్కడున్న మహిళ, ఆమెతో ఉన్న ముగ్గురు పిల్లలు కనిపించలేదు. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైన రాజశేఖర్రెడ్డి దంపతులు తమ బాబు కోసం సుమారు గంటసేపు వైద్యశాల పరిసరాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో వెంటనే సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడి ఫొటోలను సమీప పోలీస్ స్టేషన్లకు పంపించి, అప్రమత్తం చేశారు. బాలుడి వద్ద ఇషాన్రెడ్డి ఫోన్ ఉండటంతో ఫోన్ లోకేషన్పై దృష్టి పెట్టి, సదరు మహిళ సుచిత్ర చౌరస్తాకు చేరుకున్నట్లు గుర్తించారు. పోలీసుల కదలికలను గమనించిన సదరు మహిళ.. అక్కడి నుంచి సుభాష్నగర్ మీదుగా షాపూర్నగర్కు చేరుకున్నది. అక్కడ సైతం పోలీసులు తనిఖీలు చేస్తుండగా.
షాపూర్నగర్లోని సాగర్హోటల్ సమీపంలో ఉన్న ఆటోల అడ్డా వద్ద బాలుడిని వదిలిపెట్టి.. బాలుడి వద్దనున్న సెల్ఫోన్ను తీసుకుని పారిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. బాలుడు సురక్షితంగా దొరకడంతో పోలీసులు ఊపిరిపీల్చుకుని.. అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇషాన్రెడ్డి తల్లిదండ్రులతో పాటు పలువురు పోలీసులను అభినందించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితురాలి వయస్సు సుమారు 40 ఏండ్లు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.