సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): యూఎస్ పౌరులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ను నడుపుతున్న రెండు ముఠాల గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ కేసుల్లో 115 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్దనుంచి రూ. 4.5లక్షల నగదు, 115 సీపీయులు, 7 ల్యాప్టాప్లు, 94 మానిటర్లు, 4 రూటర్లు, 120 సెల్ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ స్టీఫెన్ రవీంద్ర శుక్రవారం మాదాపూర్ డీసీపీ సందీప్రావు, మాదాపూర్ ఇన్స్పెక్టర్ ఎన్.తిరుపతితో కలిసి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. అహ్మదాబాద్కు చెందిన ఎండీ అన్సారీ మొహిర్ఫాన్ మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్ వెనుక వైపున ఏజీఆర్ సొల్యూషన్స్ పేరుతో నకిలీ ఇంటర్నేషనల్ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి తన బృందంతో కలిసి ఏజీఆర్ కాల్సెంటర్పై దాడులు జరిపి.. 28 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. అంతే కాకుండా వీరి పక్కనే ఏజీ సొల్యూషన్ పేరుతో మరో నకిలీ కాల్ సెంటర్ను అహ్మదాబాద్కు చెందిన ఘాన్సీ అకిబ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆ కాల్ సెంటర్పై కూడా దాడులు జరిపి పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
యూఎస్ బార్డర్ ప్రొటెక్షన్, కస్టమ్స్ అధికారుల పేరుతో..
నిందితులు కాల్సెంటర్స్ ఇండియా డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా యూఎస్కు చెందిన పౌరుల వ్యక్తిగత వివరాలను కొనుగోలు చేస్తారు. ఒక్కో వ్యక్తి డేటాను రూ.10పైసల చొప్పున కొనుగోలు చేస్తారు. అనంతరం కాల్సెంటర్ ఉద్యోగులు యూఎస్ పౌరులకు వీఓఐపీ కాల్స్ చేసి.. తాము యూఎస్ కస్టమ్స్, బార్డర్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులమంటూ పరిచయం చేసుకుని, మీ పేరుతో చట్టవ్యతిరేకమైన డ్రగ్స్, ఇతర నిషేధిత పదార్థాల పార్సిల్స్ వచ్చాయని బెదిరిస్తారు. మీరు యూఎస్ మార్శల్స్తో మాట్లాడాలని సూచించి, కాన్ఫరెన్స్ ద్వారా కాల్సెంటర్ ఉద్యోగులే మార్శల్స్గా మాట్లాడుతూ.. మీరు జరిమానా చెల్లిస్తే మీపైన నమోదు చేసిన కేసులను తొలగిస్తామని నమ్మబలుకుతారు. రూ.5వేల నుంచి 6 వేల యూఎస్ డాలర్ల ఖరీదైన గిఫ్ట్కార్డును అమెజాన్ నుంచి కొనుగోలు చేసి, దాని కోడ్ నంబర్ చెప్పాలని సూచిస్తారు. దీంతో బాధితులు నిందితులు చెప్పినట్లుగానే గిఫ్ట్కార్డును కొనుగోలు చేసి.. దాని కోడ్ నంబర్ను చెబుతారు. దీంతో నిందితులు ఆ గిఫ్ట్కార్డులను తక్కువ ధరకు ఇతరులకు విక్రయించి వచ్చిన ఆదాయాన్ని క్రిప్టో కరెన్సీగా మార్చుకుంటారు. అనంతరం ఈ క్రిప్టో కరెన్సీని స్థానికంగా బిట్కాయిన్గా మార్చుకుని, ఆ తర్వాత నగదు రూపంలో మార్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏజీ సొల్యూషన్స్ పేరుతో కూడా యూఎస్ పౌరులను మోసగిస్తున్నారు.
తొలిసారి డిజిటల్ హవాలా గుర్తింపు..
నకిలీ కాల్సెంటర్ నిర్వాహకులు యూఎస్ పౌరులను మోసగించి, వారి నుంచి వచ్చే సొమ్మును తెలివిగా గిఫ్ట్ కార్డుల నుంచి క్రిప్టోకు, క్రిప్టో నుంచి బిట్కాయిన్ రూపంలోకి మార్చిన అనంతరం లోకల్ కర్సెలోకి మార్చుకుని నగదు రూపంలో హవాలా చేస్తున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఈ విధంగా డిజిటల్ హవాలా జరుగుతున్న తీరును గుర్తించడం ఇదే మొదటి సారని తెలిపారు.
ఆర్డర్ల పేరుతో..
మరో కేసులో గుజరాత్కు చెందిన ప్రదీప్ వినోద్ రాథోడ్, ఉస్మాన్ ఘనీ ఖాన్, శివం ప్రధాన్, దీపు తాపర్ కలిసి వెర్ట్స్ సొల్యూషన్స్ పేరుతో మాదాపూర్ ప్రాంతంలోనే నకిలీ అంతర్జాతీయ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. ఈ కేసులో కూడా నిందితులు యూఎస్ పౌరులనే లక్ష్యంగా చేసుకుని వారికి వీఓఐపీ కాల్స్ చేసి, మేము అమెజాన్ నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ఫోన్, ల్యాప్టాప్ వంటి వస్తువులకు ఆర్డర్ చేశారు.. మీ ఆర్డర్ ఐడీ ఇవ్వమని అడుగుతారు. దీంతో నివ్వెరపోయిన బాధితులు తాము ఎలాంటి ఆర్డర్ చేయలేదని చెప్పినా వినరు. మీరు ఎక్కడైనా డిజిటల్ లావాదేవీలు జరిపారా.. అని ప్రశ్నించి, ఎవరో మీ సమాచారాన్ని దొంగిలించి ఉంటారని, వారే మీ పేరు మీద ఆర్డర్ చేసి ఉంటారని నమ్మిస్తారు. మీరు ఈ ఆర్డర్ క్యాన్సల్ చేసుకోకపోతే మీ బ్యాంకు ఖాతాలో నుంచి డబ్బులు కట్ అవుతాయని భయపెడుతారు. అలా డబ్బులు కట్టకుండా ఉండాలంటే మీ బ్యాంక్ అధికారులను సంప్రదించాలని చెబుతారు. అంతటితో ఆగకుండా బ్యాంక్ అధికారులను కాన్ఫరెన్స్లోకి తీసుకుంటున్నామని నమ్మించి.. నిందితులే బ్యాంక్ అధికారులుగా మాట్లాడతారు. మీరు మీ ఆర్డర్ క్యాన్సల్ చేసుకోవాలంటే అపరాధ రుసుము కింద మీరు ఒక చిన్న గిఫ్ట్కార్డు కొనుగోలు చేయాలని సూచిస్తారు. దీంతో బాధితులు అమెజాన్ నుంచి గిఫ్ట్కార్డును కొనుగోలు చేస్తారు.
ఆ గిఫ్ట్కార్డు కోడ్ తెలుసుకున్న నిందితులు ఆ కార్డును ప్యాక్ఫుల్ వెబ్సైట్ ద్వారా ఇతరులకు తక్కువ ధరకు విక్రయించి, క్రిప్టో, బిట్కాయిన్ ద్వారా నగదు పొందుతారు. ఈ నకిలీ కాల్సెంటర్ నిర్వాహకుల బారిన ఇప్పటి వరకు యూఎస్కు చెందిన వారే పడినట్లు సీపీ వివరించారు. యూఎస్లో 500 డాలర్లలోపు ఏదైనా ఆన్లైన్ మోసం జరిగితే.. కేసులు నమోదు చేయరని, దీనిని ఆసరాగా చేసుకుని నిందితులు యూఎస్, కెనడా పౌరులనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ఎస్ఐలు గౌతమ్, రవి, నర్సింహారావు, వెంకటేశ్, స్వేతలను సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.