సిటీబ్యూరో/వనస్థలిపురం, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ వ్యక్తి ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు చనిపోయారు. పాదచారుడు తీవ్రంగా గాయపడ్డాడు. వనస్థలిపురం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… నల్గొండ జిల్లా అల్వాల గ్రామానికి చెందిన కంచర్ల శివ(20), మిర్యాలగూడకు చెందిన నకిరెకంటి సందీప్ కుమార్(20) ఇంజినీరింగ్ చదువుతున్నారు. మంగళవారం రాత్రి సాగర్రోడ్ ఓంకార్నగర్లోని పెట్రోలు బంక్ వద్ద ద్విచక్రవాహనంపై వీరిద్దరూ ఆగి ఉన్నారు. అదే సమయంలో టీచర్స్ కాలనీలో నివాసముండే కనకాల రామ్కుమార్రెడ్డి అతడి స్నేహితుడితో కలిసి కారులో గాయత్రీనగర్ వైపు నుంచి సాగర్రింగ్రోడ్డు మీదుగా వెళ్తున్నారు.
మద్యం మత్తులో ఉన్న కనకాల రామ్కుమార్రెడ్డి నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడుపుతూ.. రోడ్డుపై ఆగిఉన్న శివ, సందీప్ను ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రోడ్డు దాటుతున్న సభావత్ శ్రీధర్ను కూడా కారు ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, మృతుల కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం సాయంత్రం వనస్థలిపురం పీఎస్ను ముట్టడించారు. నిందితుడిపై పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని నినదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ..ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పారు. యువకుల మృతికి కారణమైన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కోర్టులో శిక్షపడే విధంగా చేస్తామని ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు తెలిపారు. బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.