పరిశీలన పూర్తి పనులు ప్రారంభం..
గోల్నాక, ఏప్రిల్ 12: అంబర్పేట డివిజన్ పరిధిలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కానున్నది. ఇప్పటికే అంబర్పేట మున్సిపల్ కాలనీలో ప్రభుత్వ దవాఖాన విస్తృత వైద్య సేవలు అందిస్తుండగా దీనికి తోడు ఒకేసారి రెండు బస్తీ దవాఖానల ఏర్పాటు దిశగా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటున్నది.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీల్లో నివసించే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఇప్పటికే వందలాది బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, అందులో భాగంగా అంబర్పేట డివిజన్లో ఒకే సారి రెండు బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందుకు సంబంధించి అంబర్పేట డివిజన్ పటేల్నగర్లో భవన నిర్మాణ పనులు చేపట్టిన అధికారులు తాజాగా రఘునాథ్నగర్ కమ్యూనిటీహాల్ వద్ద అనువైన స్థలాన్ని సేకరించారు. త్వరలోనే నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు రంగం సిద్ధం చేశారు.
త్వరలోనే అందుబాటులోకి తెస్తాం..
అంబర్పేట డివిజన్లో త్వరలోనే రెండు బస్తీ దవాఖానలు అందుబాటులోకి తెస్తాం. గోల్నాక గంగానగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానకు విశేష స్పందన లభిస్తున్నది. డివిజన్ పరిధిలో రెండు బస్తీ దవాఖానలు అందుబాటులోకి వస్తే ప్రైవేటు వైద్య ఖర్చులు తగ్గి పేదల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడనున్నది.
– ఇ.విజయ్కుమార్గౌడ్, కార్పొరేటర్