సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ): సరూర్నగర్ పంజాల అనిల్కుమార్ కాలనీ వద్ద బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తన ఇష్టానికి విరుద్ధంగా సోదరి వివాహం చేసుకుందనే కక్షతోనే ఆమె సోదరుడు అతడి స్నేహితుడు కలిసి నాగరాజును హత్య చేసినట్లు తేలింది. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం..వికారాబాద్ మర్పల్లికి చెందిన నాగరాజు, అశ్రిన్ సుల్తానా ఒకే దగ్గర చదువుకున్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ విషయం అశ్రిన్ సుల్తానా సోదరుడు మోబిన్ అహ్మద్కు తెలిసి.. అనేక సార్లు వారించాడు.
ఈ ఏడాది జనవరి 30న ఇంట్లో నుంచి వచ్చేసిన అశ్రిన్ సుల్తానా.. మరుసటి రోజు నాగరాజును ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నది. అయితే అశ్రిన్ సుల్తానా అదృశ్యమైందంటూ..ఆమె కుటుంబసభ్యులు బాలానగర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, వారిద్దరూ వికారాబాద్లోని మోమిన్పేట్ పీఎస్లో పోలీసుల ఎదుట హాజరై.. తాము మేజర్లమని, ఇష్టానుసారంగానే పెండ్లి చేసుకున్నామని చెప్పారు. ఆ సందర్భంలో పోలీసులు రెండు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా.. అశ్రిన్ సోదరుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ తన సోదరి ఇతర మతానికి చెందిన నాగరాజు మభ్యపెట్టి లొంగదీసుకుని పెండ్లి చేసుకున్నాడని పగను పెంచుకున్నాడు.
పాస్వర్డుగా ఫోన్ నంబర్..
పెండ్లి తర్వాత నాగరాజు, అశ్రిన్ దంపతులు కొన్ని రోజులు దుండిగల్లో ఉన్నారు. రెండు నెలల కిందట సరూర్నగర్ పంజాల అనిల్కుమార్ కాలనీకి మకాం మార్చారు. నాగరాజు మలక్పేటలోని ఓ షోరూమ్లో పనిచేస్తున్నాడు. సయ్యద్ మోబిన్ అహ్మద్ నిత్యం నాగరాజు గురించి ఆరా తీస్తుండేవాడు. ‘ఫైండ్ ఔట్’ యాప్ ద్వారా నాగరాజు, అశ్రిన్ల లొకేషన్ను గుర్తించేందుకు ప్రయత్నించాడు. ఆ అప్లికేషన్లో నాగరాజుకు సంబంధించిన ఫోన్ నంబర్ను పాస్వర్డుగా, యూజర్నేమ్గా టైప్ చేయడంతో అతడి లొకేషన్ను గుర్తించాడు.
కొత్తపేట చౌరస్తాలోనే స్పాట్..
ఫైండ్ ఔట్ యాప్ ద్వారా నాగరాజు పనిచేస్తున్న షోరూమ్ను గుర్తించిన సయ్యద్ మోబిన్ అహ్మద్ బుధవారం తన స్నేహితుడు మహ్మద్ మసూద్ అహ్మద్ను వెంటబెట్టుకొని. మలక్పేట షోరూమ్ వద్దకు వచ్చాడు. అతడు బయలుదేరే టైం తెలుసుకొని.. నాగరాజును 8.30 గంటల తర్వాత మలక్పేట నుంచి ఫాలో అయ్యాడు. కొత్తపేట చౌరస్తా దగ్గర తమ వెంట తెచ్చుకున్న సెంట్రింగ్ రాడ్, కత్తితో హత్య చేద్దామని సిద్ధమయ్యాడు. అక్కడ సిగ్నల్ దగ్గర నాగరాజు మిస్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే సయ్యద్ మోబిన్ అహ్మద్ ఫైండ్ ఔట్ యాప్ను తెరిచి.. మరోసారి నాగరాజు లొకేషన్ను ఫాలో అయ్యాడు. అప్పుడు నాగరాజు ఇంటికి వెళ్లి.. తిరిగి కూరగాయల కోసం అశ్రిన్ను తీసుకుని పంజాల అనిల్కుమార్ కాలనీ వద్ద ఉన్నట్లు గుర్తించి.. అక్కడ అడ్డగించాడు.
నాగరాజును కింద పడేసి సెంట్రింగ్ రాడ్తో దాడి చేశాడు. ఆ తర్వాత అతడి స్నేహితుడు మహ్మద్ మసూద్ అహ్మద్ కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. నేరస్తులకు శిక్ష పడే విధంగా వేగవంతంగా దర్యాప్తు చేస్తామని, ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ చేపడుతామని డీసీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కాగా, నాగరాజు మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. గురువారం వికారాబాద్లోని మర్పల్లి గ్రామంలో అతడి అంత్యక్రియలను భారీ బందోబస్తు మధ్య నిర్వహించారు.