సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ): ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక నైజీరియన్తోపాటు మరో వ్యక్తిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, నాంపల్లి పోలీసులు కలిసి పట్టుకున్నారు. వీరి నుంచి 60 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ అదనపు డీసీపీ రమణారెడ్డి వివరాలను వెల్లడించారు. ముంబైకి చెందిన సోహెల్ అహ్మద్ మహ్మద్ హసన్ షేక్ ఫుట్వేర్ వ్యాపారి. నైజీరియా నుంచి బిజినెస్ వీసాపై వచ్చిన చుక్వెమేక న్యూ ముంబైలోని ఖార్గర్ ప్రాంతంలో నివాసమున్నాడు. అక్కడ ఉండే నైజీరియన్లకు భోజనం సరఫరా చేశాడు. ఈ వ్యాపారంతో వచ్చే సంపాదన సరిపోకపోవడంతో డ్రగ్స్ దందాలోకి దిగాడు
ఇందులో భాగంగా తనకు తెలిసిన నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలుచేసి.. వాటిని అక్కడ కస్టమర్లకు విక్రయించాడు. ఈ క్రమంలోనే సోహెల్ అహ్మద్తో అతడికి పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ ముంబైలో తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయించాలని పథకం వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్కు చేరుకున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద సోహెల్ అహ్మద్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు, నాంపల్లి పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 40 గ్రాముల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకొని విచారించగా.. తనతోపాటు చుకుక్వెమేక కూడా వచ్చాడని, లక్డీకాపూల్లో ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 20 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రఘునాథ్, నాంపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.