సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ): గంజాయి, హశీష్ ఆయిల్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను రాజేంద్రనగర్ ఎస్వోటి, మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన గొల్లి కుమార స్వామి(20), అదే ప్రాంతానికి చెందిన జొన్న స్వామి(20)లు ఐటీఐ చదివిన సమయంలో క్లాస్మేట్స్. ఇద్దరూ చదువును మధ్యలోనే నిలిపివేసి కూలీపనులు చేశారు. కానీ సంపాదన సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో గత సంవత్సరం జూన్లో సొంత జిల్లాకు చెందిన లక్ష్మణ్ ద్వారా గంజాయిని కొనుగోలు చేసి, నర్సీపట్నం నుంచి చెన్నయ్కి 180 కిలోల గంజాయిని రవాణా చేస్తూ పత్తిపాడు పోలీసులకు పట్టుపడ్డారు. దీంతో ఏపీ పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపగా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలయ్యారు. వెంటనే మళ్లీ లక్ష్మణ్ను సంప్రదించారు. అతడి సూచనల మేరకు నిందితులిద్దరూ ఈనెల 26న నర్సీపట్నం నుంచి గంజాయి, హశీష్ ఆయిల్ను తీసుకుని ఆర్టీసీ బస్సులో నగరానికి చేరుకున్నారు.
ఈనెల 27న నిందితులిద్దరూ ఆరాంఘర్ చౌరస్తా వద్ద గంజాయిని తీసుకువెళ్లే వ్యక్తి కోసం వేచిచూడగా, విశ్వసనీయ సమాచారం అందుకున్న రాజేంద్రనర్ ఎస్వోటి, మైలార్దేవ్పల్లి పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 28కిలోల గంజాయి ప్యాకెట్లు, 3లీటర్ల హశీష్ ఆయిల్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పర్యవేక్షణలో మైలార్దేవ్పల్లి ఎస్హెచ్వో మధు, రాజేంద్రనగర్ జోన్ ఎస్వోటి ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, ఎస్ఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.