జవహర్నగర్, మే 15 : ఆర్టీసీ బస్సులో వచ్చి.. కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాతనేరస్తులను జవహర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ సీతారాం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుకుమార్ వివరాలు వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన షేక్ మస్తాన్వలీ అలియాస్ శ్రీధర్ అలియాస్ చెర్కూరి పెద్దపీరయ్య 2010 నుంచి కడప జిల్లా నుంచి రైలులో సికింద్రాబాద్కు వచ్చి దమ్మాయిగూడ ప్రాంతాన్ని ఎంచుకొని చోరీ చేసిన సొత్తుతో తిరిగి కడపకు వెళ్లిపోయే వాడు.
ఈ క్రమంలో పెద్ద పీరయ్యకు, వేమూరి శ్రీనివాస్కు స్నేహం కుదిరింది. ఇద్దరూ కలిసి సికింద్రాబాద్ రెజిమెంటల్బజార్లో అద్దె ఇంట్లో ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి దమ్మాయిగూడకు ఆర్టీసీ బస్సులో వచ్చి కాలనీలో తాళంవేసిన ఇండ్లను ముందుగా గమనిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న మద్యం షాపునకు వెళ్లి షాపు మూసే వరకు మద్యం సేవిస్తారు. షాపు మూసేసిన తర్వాత పెద్ద పీరయ్య కాలనీలోకి వెళ్లి ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి సొత్తు చోరీ చేస్తుండగా, శ్రీనివాస్ బయట గమనిస్తుంటాడు.
ఇలా వచ్చిన సొత్తును పంచుకొని విలాసవంతమైన జీవనం గడిపేవారు. అయితే చోరీ జరిగిన చోట వేలి ముద్రలు సేకరించిన రాచకొండ పింగర్ ఫ్రింట్ బృందం నిందితుడు పెద్ద పీరయ్యగా గుర్తించారు. జవహార్నగర్ క్రైం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రెజిమెంటల్బజార్లో ఉంటున్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుల నుంచి 6తులాల బంగారు ఆభరణాలు, 2.5కేజీల వెండి, 2ల్యాప్టాప్లు, 6వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. పెద్ద పీరయ్యపై(36)పై గతంలో 8కేసులు ఉండగా, శ్రీనివాసులు(42)పై పలు పోలీస్స్టేషన్లలో నాలుగు కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సీతారాం, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మధుకుమార్, ఎస్సై రాంబాబు, పోలీసులను సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ జానకి, ఏసీపీ వెంకట్రెడ్డి అభినందించారు.