Hyderabad | బంజారాహిల్స్, జూలై 10: తన కొడుకు కిడ్నాప్ అయ్యాడంటూ ఓ వ్యక్తి చేసిన ఫోన్కాల్ ఫిలింనగర్ పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆగమేఘాల మీద సెల్ఫోన్ సిగ్నల్ ద్వారా కిడ్నాప్ అయిన వ్యక్తి ఆచూకీ కనుగొని వెళ్లగా.. తాపీగా నిందితుడిగా చెప్పబడుతున్న వ్యక్తితో కలిసి ఆ యువకుడు మద్యం సేవిస్తూ కనిపించడంతో అవాక్కయ్యారు. ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
టోలీచౌకి సమీపంలోని సమతాకాలనీలో నివాసముంటున్న మైనర్ (17)కు అదే ప్రాంతంలో నివాసముంటున్న హాస్టల్ నిర్వాహకుడు మహ్మద్ ఇమాద్తో స్నేహం ఉంది. మైనర్ తరచూ ఇమాద్ నడిపిస్తున్న హాస్టల్ వద్దకు వెళ్తుంటాడు. కాగా.. ఆదివారం రాత్రి పదిన్నర ప్రాంతంలో మైనర్ తండ్రి యాకూబ్ డయల్ 100కు కాల్ చేశాడు. తన కొడుకును గంటసేపటి కిందట ఇమాద్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని, ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతడిని ఏమైనా చేయవచ్చంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన ఫిలింనగర్ పోలీసులు ఆగమేఘాల మీద 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆచూకీ కోసం పోలీసులు పరుగులు పెట్టారు.
నిందితుడు ఇమాద్ సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గండిపేట సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇమాద్ ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అయితే, అక్కడి దృశ్యాన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కిడ్నాప్ అయ్యాడని చెబుతున్న మైనర్, నిందితుడిగా చెబుతున్న ఇమాద్ కలిసి మద్యం తాగుతూ పోలీసులకు కనిపించారు. వారిద్దరినీ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. గండిపేటలో పార్టీ చేసుకునేందుకు వెళ్లామని వారిద్దరూ విచారణలో తేల్చి చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తన కొడుకుతో ఇమాద్ గొడవపడ్డాడని, ఆదివారం రాత్రి వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో భయంతో కిడ్నాప్ అయ్యాడని భావించి డయల్ 100కు కాల్ చేశానని తండ్రి యాకూబ్ పోలీసులకు తెలిపాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.