బంజారాహిల్స్, అక్టోబర్ 4: అనుమానాస్పద స్థితిలో ఫిలింనగర్లో అదృశ్యమైన యువకుడు శామీర్పేట చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీలో స్నేహితులు మహిపాల్, ప్రవీణ్తో కలిసి గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఓ ప్రైవేట్ టీవీ చానల్లో కెమెరా మెన్గా పనిచేస్తున్న కార్తీక్.. ఈనెల 2న ఇంటి నుంచి తన పల్సర్ బైక్పై డ్యూటీకి వెళ్లాడు. రాత్రి తిరిగి గదికి రాకపోవడంతో స్నేహితుడు ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. డ్యూటీలో బిజీగా ఉండవచ్చని స్నేహితుడు భావించాడు. కాగా, మంగళవారం సాయంత్రమైన కార్తీక్ ఆచూకీ తెలియలేదు.
డ్యూటీకి కూడా రాలేదని తెలియడంతో స్నేహితుడు ప్రవీణ్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, శామీర్పేట చెరువు సమీపంలో కార్తీక్కు చెందిన బైక్తోపాటు అతడి సెల్ఫోన్ లభించడంతో అక్కడి పోలీసులు ఫిలింనగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. బుధవారం ఉదయం శామీర్పేట చెరువులో కార్తీక్ మృతదేహం లభించింది. కార్తీక్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు.