కవాడీగూడ/సిటీబ్యూరో, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో మంగళవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఘనం గా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో కలియుగ దైవం శ్రీనివాసునికి సుప్రభాత సేవను వేదపండితుల సమక్షంలో శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు దంపతులు శ్రీవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. వేదపండితులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు.
తిరుమల తరహాలో శ్రీవారి సేవలు..
ఉదయం 6 గంటలకు నిర్వహించిన సుప్రభాత సేవ అనంతరం శ్రీవారి ఇతర సేవలన్నింటినీ తిరుమల తరహాలోనే నిర్వహించారు. ఉదయం 6.30 గంటలకు తోమాల సేవను ఏకాంతంగా నిర్వహించారు. 7.30 గంటలకు అర్చన, 8.15 గంటలకు శ్రీస్వామివారికి, ఇతర మూర్తులకు లడ్డూలు, వడలు, దధ్యోజనం, పులిహోర, పొంగళ్లు తదితర ప్రసాదాలను అర్చకులు నివేదించారు. అనంతరం ఉదయం 10 గంటలకు భక్తులకు సర్వదర్శనం కల్పించారు. సాయంత్రం 5.30 గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ, సాయంత్రం 6.30 గంటలకు వీధి ఉత్సవం నిర్వహించి తిరుమల తిరువీధుల్లో లాగా తిరుచ్చిపై ఉత్సవ విగ్రహాలను భక్తుల సమక్షంలో ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు రాత్రి కైంకర్యం, రాత్రి 8.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించారు.
108 బంగారు కమలాలతో అష్టదళ పాదపద్మారాధన..
ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధనసేవను వైభవోపేతంగా నిర్వహించారు. 108 బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి.రఘునాథ్ బృందం ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి.
వేడుకగా వసంతోత్సవం..
ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునికి స్నపనతిరుమంజసం శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, కలశారాధన నిర్వహించి ఆతర్వాత నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటితో శంఖధార, చక్రధార, సహస్రధార, మహాకుంభాభిషేకాలు వైఖానస ఆగమ పద్ధతి ప్రకారం సాగాయి. తైత్తరీయ ఉపనిషత్తు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, పంచశాంతి మంత్రాలు, దివ్యప్రబంధంలో అభిషేకం చేసే సమయంలో పాశురాలను ఈ సందర్భంగా వేదపండితులు పఠించారు.
ఆకట్టుకున్న ఫొటో ఎగ్జిబిషన్ ..
టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్ భక్తులను ఆకట్టుకుంది. గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, దేశవాళీ ఆవుల పెంపకం, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, శ్రీవారి సేవ, నవనీత సేవ, శ్రీవారి పుష్ప ప్రసాదం తదితర ఫ్లెక్సీలను భక్తులు ఆసక్తిగా తిలకించారు. శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను సైతం టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచింది. అలాగే ‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులను సైతం విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. రూ.50చొప్పున విక్రయించేందుకు లడ్డూలను సైతం విక్రయ కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, ఎలక్ట్రికల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఏఈవోలు పార్థసారధి శ్రీరాములు పాల్గొన్నారు.