విద్యుత్ నష్టాలపై టీఎస్ఎస్పీడీసీఎల్ దృష్టి
అండర్ డిస్కనెక్షన్ కేటగిరీలోని కనెక్షన్లపై ప్రత్యేక డ్రైవ్
సర్కిళ్ల వారీగా సమీక్షా సమావేశాలు
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రతి యూనిట్ విద్యుత్ను లెక్కలోకి తీసుకురావాలి.. తద్వారా డిస్కంలు నష్టాల బారిన పడకుండా చూడడంతో పాటు మరింత నాణ్యతతో కరెంటు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఇదీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారుల మాట. డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసేంత విద్యుత్ అందుబాటులో ఉంది. ఇక డిస్కం పరంగా చేయాల్సిందల్లా విద్యుత్ వినియోగానికి అనుగుణంగా రెవెన్యూ వస్తుందా? లేదా ? అన్న విషయానికి అధిక ప్రాధ్యానత ఇవ్వాలని గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్ల సమీక్షా సమావేశాల్లో డిస్కం సీఎండీ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో సర్కిళ్ల వారీగా ఉన్న కనెక్షన్లలో ఎన్నింటికీ బిల్లులు వస్తున్నాయి..? ఎన్ని కనెక్షన్లు రద్దు ఉన్నాయో ప్రధానంగా చర్చించారు. ఇలాంటి కనెక్షన్లపై సెక్షన్ స్థాయిలోని అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, వాటి తాజా పరిస్థితిపై మరోసారి పరిశీలించి, కంప్యూటర్ బిల్లింగ్ విధానంలో అప్డేట్ చేయాలని ఉన్నతాధికారులు సూచించారు.
8 శాతం..
గ్రేటర్ పరిధిలో మొత్తం 9 సర్కిళ్లు ఉండగా, అందులో 56.1 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఎల్ టీ కేటగిరీలోనే ఉన్నాయి. ఇవన్నీ గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించినవే. వీటిలో సుమారు 8 శాతం అండర్ డిస్కనెక్షన్ కేటగిరీ (యూడీసీ)లో ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ లెక్కన మొత్తంలో 56.1 లక్షల కనెక్షన్లలో సుమారు 4.48 లక్షలు రద్దు కేటగిరీలో ఉన్నట్లు అంచ నా వేశారు. ఇలాంటి కనెక్షన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిజంగా అవి వినియోగంలో ఉన్నాయా? లేవో తెలుసుకొని.. 1-2 నెలల్లో దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పంపిణీ సంస్థకు ఎంతో నష్టాన్ని తీసుకొస్తున్న అండర్ డిస్కనెక్షన్ కేటగిరీపై సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.