హైదరాబాద్: వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)’ మోడల్గా నిలిచిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్లతోపాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
రాఖీ పౌర్ణమి ఛాలెంజ్, శ్రావణ మాసం ఛాలెంజ్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజియన్లకు ట్రోఫీలను అందజేశారు. మొత్తం 286 మందిని అవార్డులు వరించగా వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మందికి అవార్డులు దక్కాయి. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్లతో పాటు సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు ఇలా అన్ని విభాగాల వారు పురస్కారాలను అందుకున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.
క్లిష్ట పరిస్థితులను తట్టుకుని తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్థాయికి సంస్థ ఎదగడం చూస్తుంటే సంతోషంగా ఉందని ఎండీ సజ్జనార్ అన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు. రాఖీ పౌర్ణమికి రికార్డు స్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేల్లోనూ ఇంత మొత్తంలో ఆదాయం రాలేదని తెలిపారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు.
100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్
ఈ 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ గురించి ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ‘రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతితో పాటు శుభ ముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ను నిర్వహించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు ఈ ఛాలెంజ్ అమల్లో ఉంటుంది. గత ఛాలెంజ్ల మాదిరిగానే పనిచేసి, ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్య స్థానాలకు చేరవేయాలి’ అని కోరారు. ఈ నవంబర్, డిసెంబర్ నుంచి 1000 కొత్త డీజిల్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులో తీసుకువస్తున్నామని ఎండీ తెలిపారు.
రాఖీ పౌర్ణమి ఛాలెంజ్లో పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్కు రూ.లక్ష, సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండకు రూ.75 వేలు, థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్కు రూ.50 వేలు నగదు అందింది. శ్రావణ మాసం ఛాలెంజ్లో ఫస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్కు రూ.లక్ష, సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండకు రూ.75 వేలు, థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్కు రూ.50 వేలు అందజేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం (కమర్షియల్) సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.