సుల్తాన్బజార్,అక్టోబర్ 10: దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా తెలంగాణతో పాటు అంతరాష్ట్ర బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని,ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఏడాది 4035 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బీ. వరప్రసాద్ తెలిపారు. ఈనెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ర్టాలకు అదనపు బస్సులను నడపడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించామన్నారు.
జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి దసరా పండుగ నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లేందుకుగాను ఎంజీబీఎస్కు వచ్చే ప్రయాణికుల కోసం బస్సుల వివరాలతో పాటు ఏఏ ఫ్లాట్ ఫారంల నుంచి ఏ బస్సు బయలు దేరుతున్నదనే సమాచారాన్ని తెలిపేందుకు గాను నాలుగువైపులా మే ఐ హెల్ప్ యూ కౌంటర్లను ఏర్పాటు చేశారు.
నేటి నుంచి రూట్లలో తాత్కాలిక మార్పులు
సీబీఎస్ నుంచి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు షెడ్యూలు, స్పెషల్ బస్సులు నడపనున్నారు.
జూబ్లీబస్స్టేషన్ నుంచి కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,మెదక్ జిల్లాల వైపు షెడ్యూలు,స్పెషల్ బస్సులు.
ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి వరంగల్ వైపు వెళ్లే షెడ్యూలు,స్పెషల్ బస్సులు.
దిల్సుఖ్నగర్ బస్స్టేషన్ నుంచి మిర్యాలగూడ,నల్గొండ,కోదాడ,సూర్యాపేట వైపు షెడ్యూలు,స్పెషల్ బస్సులు.ఎంజీబీఎస్ నుంచి విజయవాడ,విశాఖ పట్నం, ఈస్ట్ గోదావరి,వెస్ట్ గోదావరి, గుంటూరు, ఖమ్మం, మహబూబ్నగర్, శ్రీశైలం, నాగర్ కర్నూలు, వనపర్తి, పరిగి, వికారాబాద్, తాండూరు, మెదక్, జహీరాబాద్ వైపు వెళ్లే షెడ్యూలు,స్పెషల్ బస్సులు.
జంట నగరాల్లో ప్రత్యేక పాయింట్ల ద్వారా బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కాలనీల్లోని 20 మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉంటే స్థానిక డిపో మేనేజర్కు సమాచారం అందిస్తే వారి ఇంటి వద్దకే బస్సును పంపిస్తామన్నారు.అన్ని పాయింట్ల వద్ద ఆర్ఎం స్థాయి నుంచి డీవీఎం,డిపో మేనేజర్లు అందుబాటులో ఉండి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకొంటారు. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో www.tsrtconline. in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.