సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం మరో పదిరోజులపాటు పొడగించింది. మూడో విడుత లాక్డౌన్ ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న సడలింపును సాయంత్రం 5 గంటల వరకు పొడగించారు. గంటలోపు ఇండ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లాక్డౌన్ అమలవుతుంది. సడలింపు నేపథ్యంలో ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కూడా సాయంత్రం వరకు రాకపోకలు సాగించనున్నాయి.
ప్రస్తుతం సిటీ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 వరకు తిరుగుతుండగా, మరింత సడలింపు నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు రాకపోకలు సాగిస్తాయి. లాక్డౌన్ సడలింపు పొడగించడం వల్ల ఆర్టీసీకి మరికొంత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కార్గో పార్సిల్ సర్వీసులు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు నడుస్తున్న మెట్రో రైళ్లు గురువారం నుంచి సాయంత్రం 5:30 వరకు నడుస్తాయి. మూడు కారిడార్లలో ఉదయం 7 గంటలకు మొదటి రైలు, సాయంత్రం 5.30 గంటలకు చివరి రైలు స్టేషన్కు చేరుకుంటుంది. ఇప్పటివరకు మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంది.