సుల్తాన్బజార్, మే 30: నిరంతరం ప్రజలతో కలిసి ఉండే ఆర్టీసీ ఉద్యోగులందరూ కొవిడ్ టీకాలు తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి, హైదరాబాద్ ఆర్టీవో వెంకటేశ్వర్లు, నాంపల్లి తహసీల్దార్ రామకృష్ణ, ఆర్టీసీ ఈడీవో ఇ.యాదగిరి, ఈడీ పి.ముని శేఖర్, ఆర్ఎం వరప్రసాద్, ఎస్సీఆర్ఎం సరిరాం, డీవీఎం ఎంఆర్సీ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సుధ, ఎస్పీహెచ్వో డాక్టర్ బిర్జూస్ ఉన్నిసాలతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా టీకా వేసుకున్న ఉద్యోగులకు మాజ జ్యూస్లను అందించారు.
అనంతనం, ఆయన మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ప్రజలతో మమేకమయ్యే డ్రైవర్లు, కండక్టర్లు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ నెలలో 45 ఏళ్ల పై బడిన ఉద్యోగులంతా టీకాలు తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు టీకా తీసుకోవాల్సి ఉండగా శనివారం నుంచి ఇప్పటి వరకు 16,840 మందికి టీకాలు పూర్తయ్యాయని అన్నారు. పూర్థి స్థాయిలో టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటి మాట్లాడుతూ, ఎంజీబీఎస్, జేబీఎస్, రేతిఫైల్ బస్ స్టేషన్, బస్ భవన్, తార్నాక ఆర్టీసీ దవాఖానలో ఆరుగురు ఎస్పీహెచ్వోల నేతృత్వంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు టీంలుగా ఏర్పడి ఆర్టీసీ ఉద్యోగులకు టీకాలు వేస్తున్నారన్నారు. ప్రతి ఉద్యోగి కరోనా బారిన పడకుండా ఉండేలా టీకాను కచ్ఛితంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 7,900 మందికి వ్యాక్సినేషన్ వేయాల్సి ఉండగా, ఆదివారం వరకు దాదాపు 97 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీలో దాదాపు 14 కేంద్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుందన్నారు. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కండక్టర్లు, డ్రైవర్లు పెద్ద సంఖ్యలోనే హాజరయ్యారని తెలిపారు.
టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు నగేశ్ కుమార్
సిటీబ్యూరో, మే 30 ( నమస్తే తెలంగాణ ) : క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లను సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి డ్రైవర్లకు భరోసానిచ్చిన ప్రభుత్వానికి టీఆర్ఎస్కేవీ ట్యాక్సీ సెక్టార్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అత్తినమోని నగేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కృతజతలు తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ చేపట్టడం గొప్ప విషయమని చెప్పారు.