హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు.
రూ. 5 కే నాణ్యమైన భోజనం అందించేందుకు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీన అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై ప్రభుత్వం తరపున టీఎస్ఎంఎస్ఐడీసీ, హరే కృష్ణ మూమెంట్ సంస్థ కలిసి సంతకాలు చేశాయి.
దీర్ఘకాల అనారోగ్యం, శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాలు, రక్తశుద్ధి తదితర సమస్యలతో నగరంలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానలు,జిల్లా ఆస్పత్రులు, ప్రాంతీయ ఆస్పత్రుల్లో వేలాదిమంది చికిత్స పొందుతున్నారు. వీరికి సహాయంగా వచ్చేవారు సరైన తిండి దొరకక అవస్థలు పడుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రోగి సహాయకులకు రూ.5కే ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం, రాత్రి భోజనం పెట్టాలని నిర్ణయించిన విషయం విదితమే.
ఒక్కొక్కరికి మూడు పూటలా.. ఉదయం పెరుగన్నం, పులిహోర, వెజి టబుల్ పలావ్, సాంబర్ రైస్ అందిస్తారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో అన్నం, పప్పు లేదా సాంబార్, ఒక కూర, పచ్చడి వడ్డిస్తారు. దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.3.22 కోట్ల భారం పడనుంది.
1. ఉస్మానియా ఆస్పత్రి – వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
2. నిలోఫర్ ఆస్పత్రి – ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు
3. సరోజిని దేవీ కంటి ఆస్పత్రి – ఎమ్మెల్సీ సురభి వాణి దేవీ
4. మెటర్నిటీ హాస్పిటల్, పేట్లబుర్జు – ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
5. గాంధీ ఆస్పత్రి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
6. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ – మంత్రి కేటీఆర్
7. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, ఎర్రగడ్డ – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
8. ఈఎన్టీ హాస్పిటల్, కోఠి – డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
9. ఫీవర్ హాస్పిటల్, నల్లకుంట – ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
10. మెటర్నిటీ హాస్పిటల్, సుల్తాన్ బజార్ – మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
11. నిమ్స్ హాస్పిటల్ – మంత్రి హరీశ్రావు
12. టిమ్స్, గచ్చిబౌలి – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
13. కింగ్ కోఠి హాస్పిటల్ – ఎమ్మెల్యే రాజాసింగ్
14. ఎంఎన్ ఏరియా హాస్పిటల్, మలక్పేట్ – హోంమంత్రి మహముద్ అలీ
15. ఏరియా హాస్పిటల్, గోల్కొండ – ఎమ్మెల్యే కౌసర్ మోహిద్దీన్
16. ఏరియా హాస్పిటల్, వనస్థలిపురం – మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
17. ఏరియా హాస్పిటల్, కొండాపూర్ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
18. ఏరియా హాస్పిటల్, నాంపల్లి – ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్