Ronald Ross | సిటీబ్యూరో, మే 21, (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరుపై కమిషనర్ రొనాల్డ్రాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్మాణ రంగ అనుమతుల జారీలో అధికారుల పనితీరును మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఏదో ఒక కారణంతో తిరస్కరించడం సరికాదన్నారు. గత నాలుగైదు నెలల్లో షార్ట్ఫాల్స్, రిజెక్ట్ చేసిన దరఖాస్తుల వివరాలు అందించాలని కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో టౌన్ప్లానింగ్ శాఖ అధికారులతో ఆయా అంశాలపై కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షార్ట్ఫాల్స్, రిజెక్ట్ అయిన దరఖాస్తుల వివరాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సర్కిళ్ల వారీగా సమీక్షించారు.
ఇన్స్టంట్ అఫ్రూవల్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి జాప్యం జరగరాదని, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత ఆమోదించాలన్నారు. టీఎస్ బీపాస్ కింద వచ్చిన బిల్డింగ్ పర్మిషన్లకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. కమర్షియల్ అనుమతులకు సంబ ంధించి క్షేత్రస్థాయిలో కుణ్ణంగా తనిఖీలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలని, ప్రతి గల్లీకి వెళ్లి చూడాలన్నారు. సెల్లార్లను పరిశీలించాలని సూచించారు. వర్షాలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్రప్రసాద్ నాయక్, అడిషనల్ సీపీలు గంగాధర్, ప్రదీప్లతో పాటు సీపీలు, ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు, టౌన్ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.