మైలార్దేవ్పల్లి,మే 29: ప్రధాన రహదారిపై భారీ వాహనాలు యథేచ్ఛగా పార్కింగ్ చేయడంతో నిత్యం వాహనదారులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి రహదారుల్లో ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడం వలన ద్విచక్ర వాహనదారులు,ఆర్టీసీ బస్సులు ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరక యాతన పడుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్పల్లి డివిజన్ మధుబన్ కాలనీ ప్రధాన రహదారిపై లారీలను అక్రమంగా పార్కింగ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ ఆయిల్ మిల్ నుంచి రవి ఫుడ్స్ ప్రధాన రహదారికి ఇరువైపులా లారీలు,కంటైనర్లు పార్కింగ్ చేసి వెళ్తున్నారు. పరిశ్రమలు ఉండటంతో భారీ వాహనాలు ముడి సరకుతో వస్తాయి. ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్ చేయడంవలన ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో అనేక మార్లు ట్రాఫిక్ పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి మార్పు కనిపించలేదు. పరిశ్రమల యజమానులు తమ కంపెనీలకి వచ్చే లారీలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య లేకుండా అవుతుందని వాహనదారులు కంపెనీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
మధుబన్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా పార్కింగ్ చేసిన లారీలకు గతంలో చలాన్లు విధించాం. పరిశ్రమల యజమానులకు దృష్టికి తీసుకెళ్లాం. వారి తీరు మారడం లేదు. వారికి నోటీసులు జారీ చేసి వాహనాలను రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూస్తాం. అక్రమ పార్కింగ్పై చర్కలు తీసుకుంటాం.
– శ్యామ్సుందర్రెడ్డి, రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్