సిటీబ్యూరో, 24 అక్టోబర్ (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ద్విదశాబ్ధి ఉత్సవాలకు నగరంలోని హైటెక్స్ వేదికైన విషయం విదితమే. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని అలుపెరుగని పోరాటంతో తన ప్రస్థానాన్ని ముందుకు సాగించింది గులాబీ సైన్యం. 20 వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఉద్యమ పంథాను ఎన్నుకొన్నది. ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది.
అయితేనేం పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఎన్నో విజయాలను సొంతం చేసుకుని.., ప్రజలకు అనేక సంక్షేమ ఫలాలను అందించింది. ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్లీనరీకి వచ్చే పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు నగర గులాబీ సైనికులు ఉత్సాహంగా ఉన్నారు.
నగరంలోని కూడళ్లతోపాటు వీధులన్నీ గులాబీ వర్ణాన్ని సంతరించుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ మహానగరం పింక్ సిటీని తలపిస్తున్నది. సుదీర్ఘ పోరాటం చేసిన పార్టీగా.. 20 ఏండ్లలో సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు వివరించనున్నది. వేదిక ద్వారా టీఆర్ఎస్ అధినేత పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనుండటంతో పార్టీ కార్యకర్తలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
నగరంలో ఆదివారం ఒక్కరోజే వేలాది వివాహాలు అత్యంత వైభవంగా జరిగాయి. గ్రేటర్ పరిధిలోని ఏ ఫంక్షన్ హాలు చూసినా పెళ్లి వేడుకలతో సందడిగా కనిపించాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మంచి ముహూర్తం కావడం, కరోనా తీవ్రత పెద్దగా లేకపోవడంతో వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాల్స్కు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. మొత్తంగా ఈ ఆదివారం ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.