సిటీబ్యూరో, అక్టోబరు 23(నమస్తే తెలంగాణ): మహా నగరం యావత్తు గులాబీ వనంగా మారింది. దసరా దీపావళి పండుగల మధ్యలో మరో పండుగై, నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణాన్ని తెచ్చి పెట్టింది. టీఆర్ఎస్ ద్విదశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25న హెచ్ఐసీసీ వేదికగా జరిగే ప్లీనరీ వేడుకకి గ్రేటర్ పెద్ద ఎత్తున ముస్తాబైంది. వేడుకకు రెండు రోజుల ముందే పండగ వాతావరణం నెలకొంది. నగరంలోని ప్రధాన కూడళ్లలో సీఎం కేసీఆర్ నిలువెత్తు కటౌట్లు, సంక్షేమ పథకాలను వివరించే ఫ్లెక్సీలు ఉత్సవ మండపాలు, పెండ్లి తోరణాలుగా దర్శమిస్తున్నాయి. కేబీఆర్ పార్కు నుంచి-జూబ్లీహిల్స్ చెక్పోస్టు, నెక్లెస్ రోడ్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, మెహిదీప ట్నం, శేరిలింగంపల్లి, బేగంపేట రూట్లు, హోర్డింగులలో ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి. జంక్షన్లలో ప్రత్యేక తోరణాలు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తంగా గ్రేటర్ గులాబీ వర్ణాన్ని పులుముకుంది. ఏర్పాట్లను మం త్రి తలసాని శ్రీనివాస్ పరిశీలించగా, ఆయన వెంట కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, గజ్జెల నగేష్ పాల్గొన్నారు.
అనేక విజయాలను సొంతం చేసుకొని టీఆర్ఎ స్ పార్టీ దేశంలోనే చరిత్ర సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి అప్పుడే 20 యేండ్లయ్యింది. అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఒక దిక్సూచిగా నిలిచింది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని తమ సొంత పార్టీగా భా వించి ఆదరిస్తున్నారు. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
దుండిగల్, అక్టోబర్ 23: హైటెక్స్లో జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) మరో మంత్రి సీహెచ్ మల్లారెడ్డితో కలిసి పరిశీలించారు. వారితో పాటు ఎంపీ, రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరికె పూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీలు నవీన్రావు, శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.