సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ ) : ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన 20వ వార్షికోత్సవ సభ విజయవంతమైంది. ఈ ప్లీనరీ సక్సెస్లో గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల శ్రమ.. సమష్టి కృషి ఎంతో ఉంది. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించిన వెంటనే సభ విజయవంతానికి నగర నేతలకు కమిటీల వారీగా బాధ్యతలు అప్పగించారు. కేవలం 10రోజుల వ్యవధిలోనే బాధ్యులంతా శ్రమించి సభకు ఏర్పాట్లు చేశారు.
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన గురుతర బాధ్యతలను సమర్థ్ధవంతంగా నిర్వర్తించి గ్రేటర్ నాయకులు తమ సత్తాను చాటుకున్నారు. అద్భుతమైన వేదిక నిర్మాణం మొదలు.. సభాస్థలం, పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాట్లు చేశారు. నిర్వహణ కమిటీలు సమష్టి కృషితో పోటాపోటీగా కార్యక్రమాలు చేపట్టి సభ విజయవంతంలో కీలక పాత్ర పోషించారు. ఏర్పాట్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు చేరవేస్తూ.. వారి సూచనలు, సలహాలను తీసుకుంటూ సమన్వయం చేసుకున్నారు.
సభకు హాజరుకానున్న ప్రతినిధులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహణ బాధ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఎవరికి సంబంధించిన పనులను వారు పక్కా ప్రణాళికలతో పూర్తి చేశారు. ఆహ్వాన కమిటీకి సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, సభా ప్రాంగణం, అలంకరణ బాధ్యతలు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ కె.నవీన్కుమార్, చైర్మన్లు బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యవేక్షించారు.
ప్రతినిధుల పేర్లు నమోదు, వలంటరీ కమిటీ బాధ్యతలు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్కింగ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బండి రమేశ్, గ్రేటర్ హైదరాబాద్ అలంకరణను గ్రేటర్ మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీ మయంగా మార్చారు. ప్రత్యేకంగా ప్రతినిధుల భోజనం విషయంలో 36 రకాల పసందైన రుచులను అందించారు. ఇందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పనితీరు అభినందనీయమని అతిథులు కొనియాడారు.
బంజారాహిల్స్, అక్టోబర్ 25: ప్లీనరీ సభా వేదికతోపాటు అలంకరణ చాలా బాగా చేశారు.. ఎక్సలెంట్.. అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను ప్రశంసించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ను ప్లీనరీ వేదిక వద్ద ఎమ్మెల్యే మాగంటి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్లీనరీ వేదికను చాలా చక్కగా చేశారంటూ సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు.
ప్లీనరీలో పాల్గొనడం సంతోషంగా ఉంది
మొదటిసారిగా ప్లీనరీలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ప్లీనరీ బాధ్యతలను పది రోజులుగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చూసుకున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవ్యంగా జరిగే విధంగా చొరవ తీసుకున్నారు. ప్లీనరీకి ఆరువేల మంది వస్తారనుకున్నాం. పదివేలకు పైగా వచ్చారు. కమిటీలో ఉన్న వారందరికీ ఎవరి బాధ్యత వాళ్లకు అప్పగించారు. సభ సవ్యంగా జరిగింది. సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు. - మంత్రి సబితా ఇంద్రారెడ్డి
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనల ప్రకారం ప్లీనరీ ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని కమిటీల బాధ్యులతో కలిసి సమన్వయంతో పనిచేశాం. సంతోషంగా ఉంది. ప్లీనరీలో సీఎం ప్రసంగ విశేషాలను, ప్రజలకు తెలియజేస్తాం. ప్లీనరీ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.- కుర్మయ్య గారి నవీన్ కుమార్, ఎమ్మెల్సీ
మియాపూర్, అక్టోబర్ 25 : ద్విదశాబ్ది ఉత్సవాలు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు శేరిలింగంపల్లి నియోజకవర్గం వేదిక కావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్లీనరీ విజయవంతమైంది. అన్ని హంగులు, వసతులతో హైటెక్స్లో పార్టీ శ్రేణులకు ఏర్పాట్లు చేశాం. అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రసంగంతో పాటు భవిష్యత్ తెలంగాణపై ప్రవేశపెట్టిన పలు తీర్మానాల ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ప్లీనరీ ఆవరణలో ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నమూనా, వరంగల్ కళాతోరణం, బంగారు తెలంగాణ ఫ్లెక్సీ, టీఆర్ఎస్ ఉద్యమం, తెలంగాణ అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ఎంతో ఆకట్టుకున్నాయి. సభ విజయవంతంలో కృషి చేసిన నియోజకవర్గం పార్టీ శ్రేణులకు ప్రత్యేక అభినందనలు.
దుండిగల్, అక్టోబర్ 25: తెలంగాణ ఉద్యమకారుడిగా, సీఎం కేసీఆర్తో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. హైటెక్స్లో జరిగిన ప్లీనరీలో ప్రతినిధుల నమోదు బాధ్యతలను ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శంభీపూర్ ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. 2001లో స్వరాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని తెలిపారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తగా, ఉద్యమకారుడిగా కేసీఆర్ నేతృత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
మేడ్చల్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహానాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనా కేసీఆర్కు మంత్రి మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణకు బంగారు బాట వేస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సబ్బండ వర్గాలకు అందిస్తున్నారని, గర్వించదగిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.