సిటీబ్యూరో, 25 అక్టోబర్ (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం గూగుల్కు గుండెకాయ.. అమెజాన్, యాపిల్కు ఆయువుపట్టుగా మారిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కే.టీ.రామారావు అన్నారు. సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాలనా సంస్కరణలు, ఐటీ, విద్యుత్, పారిశ్రామిక అభివృద్ధిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సమావేశంలో మంత్రి కేటీఆర్ మట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ కంపెనీలకు హైదరాబాద్ బ్యాక్ ఆఫీస్గా మాత్రమే ఉండేదని, కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఐటీ కంపెనీలకు బ్యాక్ బోన్గా నిలిచిందని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏడేండ్లలో ఎర్ర బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా.. టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నిటికీ గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం మారిందన్నారు. తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని, ఉన్న ఉద్యోగాలే పోతాయని ఆనాడు వెక్కిరించనోళ్లు.. ఈ రోజు నోర్లు వెళ్లబెడుతున్నారని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో టీఐసీసీ, ఐపాస్ లాంటి విధానాలతో తెలంగాణకు క్యూ కడుతున్న కంపెనీలను చూసీ వహ్… క్యా బాత్ హై అనే స్థాయికి రాష్ట్రం చేరిందన్నారు.
ఈ క్రెడిట్ అంతా మన నేత కేసీఆర్దేకే దక్కుతుందన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనకు తిరుగులేదని, ఎలక్ట్రానిక్స్ రంగంలోఎదురులేదన్నారు. ఫార్మాసెక్టార్లో ఫస్ట్ ఉన్నాం.. వ్యాక్సినేషన్ ప్రొడక్షన్లో ప్రపంచానికే మనం రాజధానిగా మారిపోయామని పేర్కొన్నారు. ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకన్నామని చెప్పారు.
ఆగమైపోతదన్న తెలంగాణ ఈ రోజు దేశానికే ఆదర్శమైందని చెప్పారు. ఉపాధి రంగంలో అనేక అవకాశాలకు అక్షయపాత్ర అయ్యిందని అన్నారు. భారత దేశంలోనే ఈరోజు అతి సక్సెస్ ఫుల్ స్టార్టప్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ఏడేండ్ల క్రితం పుట్టిన యువ,నవ తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీని అద్భుతంగా ముందుకు తీసుకుపోవాలనే బృహత్తరమైన ప్రయత్నంలో భాగంగానే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీ హబ్లను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాని దేనన్నారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదని, ఇన్ క్రెడిబుల్ తెలంగాణగా భవిష్యత్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకోనుందన్నారు. కట్టుకథలకు, పిట్టకథలకు పెట్టుబడులు రావని, కఠోరంగా శ్రమించి.. అవినీతి రహితంగా క్లియరెన్స్ ఇస్తే.. రెడ్టేపిజాన్ని పక్కనబెట్టి, రెడ్కార్పెట్ వెల్కమ్ చెబితే పెట్టుబడులు వస్తాయి తప్పా ఆశామాషీగా రావన్నారు. పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది తెలంగాణ అని గుర్తుచేశారు.
గతంతలో ఒక మాట ఉండేది వాట్ బెంగాల్ థింగ్స్ టుడే.. ఇండియా విల్ థింక్ టుమారో… అంటే ఈ రోజు బెంగాల్లో ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుందనేది.. అప్పటి నానుడి అని అన్నారు. కానీ ఈరోజు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణలో వాట్ తెలంగాణ డస్ టుడే.. ఇండియా డస్ టుమారో.. అంటే ఈ రోజు తెలంగాణలో జరిగే కార్యక్రమం రేపు దేశవ్యాప్తంగా జరుగుతుందని అన్నారు. దేశంలోనే విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది మన తెలంగాణ. సంక్షేమమే కాదు, సంస్కరణ ఫలాలు కూడా తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత మన ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ఏడున్నరేండ్ల ప్రస్థానం పరిపాలన సంస్కరణలకే ఒక స్వర్ణయుగంగా నిలిచిందన్నారు.