గులాబీ శ్రేణులకు మంత్రి మల్లారెడ్డి పిలుపు
వరంగల్ రహదారి పై స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి
ప్రతి గల్లీలో గులాబీ జెండా రెపరెపలాడాలి
ఘట్కేసర్,ఏప్రిల్ 21 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, ఘట్కేసర్ మండల పరిధిలోని గ్రామా ల టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ రోడ్డుపై పార్టీ జెండాలు, భారీ కటౌట్స్, స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 21 ఏండ్లు పూర్తి చేస్తుకున్న సందర్భంగా ఈనెల 27న నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా చేపట్టాలన్నారు.
మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, మండలాల్లో గ్రామాల వారీగా పార్టీ జెండాను ఎగురవేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘటితంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మలిపెద్ది సుధీర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చామకూర భద్రారెడ్డి, చైర్మన్లు ఎం.పావనీ జంగయ్య యాదవ్, బి.కొండల్రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపాలిటీల పార్టీ అధ్యక్షులు ఎం.సురేందర్ రెడ్డి, బి.శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి గల్లీలో పార్టీ జెండా రెపరెపలాడాలి : మంత్రి
బోడుప్పల్, ఏప్రిల్ 21: పార్టీ ప్లీనరీ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురువారం బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ, సన్నాహక ఏర్పాట్లపై స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి గల్లీలో గులాబీ జెండా రెపరెపలాడాలని, అందుకు ప్రతి డివిజన్, ప్రతి కూడలిలో టీఆర్ఎస్ దిమ్మెల నిర్మాణం చేపట్టి, జెండాను ఆవిష్కరించాలని కార్పొరేటర్లు, పార్టీ డివిజన్ ఇన్చార్జిలకు సూచించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్వీట్లు పంచి, టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకోవడంతో పాటు పలు సేవాకార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.