బంజారాహిల్స్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించేలా విభజనపై ప్రధాని వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, బంజారాహిల్స్, ఖైరతాబాద్,. సోమాజిగూడ డివిజన్ల పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తలు నల్ల జెండాలు చేతబూని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఫిలింనగర్, బంజారాహిల్స్ రోడ్ నెం 2, రోడ్ నెం 12. పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల గుండా సాగిన ర్యాలీ గన్పార్క్వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఈ ర్యాలీలో కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు. వనం శ్రీనివాస్యాదవ్, రాములు హాన్తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.