త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో
దివ్యసాకేత నగరంలో నిర్వహణ
శంషాబాద్, మే 1: కరోనా మహమ్మారి నుంచి దేశం, రాష్ర్టాన్ని కాపాడాలని కోరుతూ పరమేష్టి యాగం నిర్వహించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి శ్రీ మన్నారాయణ రామానుజ జీయర్స్వామి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధి ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరంలోని దివ్యసాకేత క్షేత్రంలో సర్వరోగ నివారణ పరమేష్టి ఆగమ ప్రక్రియ యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆశ్రమ వేదపండితులు, వేద విద్యార్థులు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, హోమం, జువ్వి సమిధలు, తామర పూలతో హోమం, ఆశీర్వచనాన్ని శాస్ర్తోక్తంగా జరిపారు.
ఈ సందర్భంగా చినజీయర్ స్వామిజీ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ పొట్టన పెట్టుకుంటుందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు, వైద్యులు అవిశ్రాంతంగా పోరాడుతున్నారన్నారు. భక్త జనులకు ఆరోగ్యం, మనో బలాన్ని అనుగ్రహించాలని దైవాన్ని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో అహోబిల జీయర్ స్వామి, శ్రీ దేవనాగరజీయర్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు.