ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 29: గిరిజన యువత కేవలం ఉద్యోగాలపైనే దృష్టి సారించకుండా వ్యాపార వేత్తలుగా ఎదగాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పీవీ రమణ సూచించారు. అందుకు అనుగుణంగా వ్యాపార రంగంలో మెళకువలు నేర్చుకోవాలని అన్నారు. లాలాగూడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పీవీ రమణ మాట్లాడారు. గిరిజన యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తమ సంఘం తరఫున పదిహేను రోజుల పాటు అరవై మంది నిరుద్యోగ గిరిజన యువతీయువకులకు ఎంటర్ప్రెన్యూర్స్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. నేషనల్ స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) సహకారంతో ఈ శిక్షణ ఇప్పించామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి హైదరాబాద్ మెట్రో రైల్ జనరల్ మేనేజర్ ఏడుకొండలు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు హరిరామ్, యామిని కుమార్, శ్రీమన్నారాయణ, సతీశ్ రాథోడ్, నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.