మల్కాజిగిరి, జనవరి 29: డివిజన్లోని వెంకటాపురం వాసులకు త్వరలో ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఇరుకైన బ్రిడ్జి వద్ద ట్రాఫిక్తో సతమతమవుతున్న స్థానికులకు త్వరలో ఇబ్బందుల నుంచి మోక్షం కలుగనున్నది. అల్వాల్ సర్కిల్ వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో ఉన్న నాలా పైన 1975లో మట్టితో రోడ్డు వేశారు. అల్వాల్ నుంచి మౌలాలికి నీటి పైపులైన్ వేయడానికి వాటర్వర్క్స్ అధికారులు రోడ్డును ఉపయోగించేవారు. అప్పట్లో ఇక్కడ అన్ని పొలాలు ఉండేవి. రోడ్డును వేయడానికి అప్పటి వ్యవసాయదారులు స్వయంగా ట్రాక్టర్లతో మట్టిపోసి రోడ్డు వేయడానికి వారు కృషిచేశారు. 1976లో అల్వాల్ పంచాయతీ వారితో పాటు వాటర్ వర్క్స్ శాఖ సంయుక్తంగా 12 ఫీట్ల వెడల్పుతో చిన్నపాటి కల్వర్ట్ నిర్మించారు. అప్పట్లో ఉన్న జనసాంద్రతకు సరిపోయింది. కాలానుగుణంగా వెస్ట్ వెంకటాపురంలో ఉన్న పొలాలను లేఅవుట్లుగా చేసి పాట్లు అమ్మారు. దీంతో చాలామంది ఇక్కడ శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. జనసాంద్రత ఎక్కువ కావడంతో పాటు ఆర్టీసీ, ప్రైవేటు కాలేజీల బస్సులు, కార్లు, ఆటోలు, బైక్లు వాడకం పెరిగిపోయింది. దీంతో వెస్ట్ వెంకటాపురం బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ పెరిగిపోంది. దీంతో ఉద్యోగులు, కాలేజీ, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు రోజూ నరకయాతన పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పించడంపై దృష్టిసారించింది. వెంటనే అధికారులతో సర్వే చేయించి ప్రణాళికలు సిద్ధంచేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జి వెడల్పు కోసం దాదాపు రూ.1.40 కోట్లు అవుతుందని అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. నివేదికలు పరిశీలించిన ప్రభుత్వం ఇక్కడ బ్రిడ్జి వెడల్పుతో పాటు వాటర్ పైపులైన్లకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సాంకేతిక కారణంగా మరో రూ.20లక్షలు అవుతుందని అంచనావేసి నిధులు మంజూరు చేశారు. రూ.1.60కోట్లతో విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెలే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు.
పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం
బ్రిడ్జి వెడల్పు పనులు వేగవంతంగా పూర్తి చేస్తాం వెస్ట్ వెంకటాపురం వాసుల చిరకాల కోరిక త్వరలో కార్యరూపం దాల్చనున్నది. ప్రభుత్వం రూ.1.60 కోట్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.